యేసు సిలువలో పలికిన యేడు మాటలు - రెండవ మాట


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

మన జీవితాల్లో ఏదైనా మంచి జరిగినప్పుడు నిజంగా దేవుడున్నాడని, వ్యతిరేక పరిస్థితి ఎదురైతే అసలు దేవుడున్నాడా? అని ప్రశ్నవేసే వారు మనలోనే ఉన్నారు. నిజముగా దేవుడుంటే నాకెందుకు ఈ కష్టాలు వస్తాయని ఒకరంటే అర్హతలేని నా జీవితానికి నీ దయ ప్రసాదించు దేవా అని ప్రాధేయపడే వారు మరొకరు.

సర్వశక్తిగల సర్వాంతర్యామియైన దేవుడు తన శక్తిని బట్టి ఏ పనైనా సుళువుగా చేయగలడను మాట నమ్మని వారెవరు లేరు. అయితే, మనం అనుకున్నట్టు ఏ పనైనా జరగకపోయేసరికి... ప్రశ్నలు అనేకం. నేను ప్రార్ధించాను కదా, నా ప్రార్థనకు జవాబు ఎందుకు రాలేదు? నా ప్రార్ధన దేవుడు విన్నాడా? వినలేదా? అసలు దేవుడున్నాడా...? ఇటువంటి ప్రశ్నలు ఎన్నో.

నేనంటాను, నా ప్రార్ధన దేవుడు విని కూడా ఎందుకు నాకు ఇలా జరిగింది అని ఆలోచించే వారి కంటే, నా ప్రార్ధన దేవుడు వినేలా లేదు అని తనను తాను పరిశీలించుకునే వారు - మరియు - నా ప్రార్ధన దేవుడు వినికూడా నాకు సహాయం చేయలేకపోయాడంటే నాలో ఏదైనా అయిష్టత ఉందేమో అని సరిచేసుకునే వారంటేనే దేవునికి ఇష్టం.

ఈ రెండు స్వభావాలు కలిగిన ఇద్దరు యేసు సిలువకు ఇరువైపులా ఉన్నారు; వారు కూడా యేసుతో సిలువ వేయబడ్డారు. శ్రమ కలిగినప్పుడు ఒకడు దూషించాడు కాని మరొకడు తన జీవితంలో తాను పొందబోయే శ్రమ తనకు తగదని, చేసిన పాపాలకు తగిన శిక్ష పొందుతున్నానని ఒప్పుకున్నాడు. అంతేకాదు, యేసు క్రీస్తు ప్రభువని నమ్మి "నీ రాజ్యంలో జ్ఞాపకము చేసుకోమని" వేడుకున్నాడు.

మరణపు అంచుల్లో ఆ వ్యక్తికి కలిగిన పశ్చాత్తాపం ఆక్షణమే అతని జీవితాన్ని మార్చేసింది. యేసు క్రీస్తు ఆ వ్యక్తి మాటలను విన్నాడు... ప్రశ్నలు అడుగలేదు, తీర్పు చెప్పలేదు, కారణాలు అసలే అడగలేదు. మారు మాట్లాడకుండా "నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువు" అని అన్నాడు. సిలువలో గొప్పతనం ఇదే. మనం ఎటువంటి జీవితం జీవించినా, ఎటువంటి పరిస్థితిలో మనమున్నా...సిలువ దగ్గరే క్షమాపణ దొరుకుతుంది. ఇదే యేసు క్రీస్తు క్రమాపణతో కూడిన ప్రేమలో మనం పొందే రక్షణ.

నేడు నీవు నాతో కూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను లూకా 23:43