పునరుత్ధానమును ప్రకటించిన ప్రథమ మహిళ


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Women
  • Reference: Sajeeva Vahini

పునరుత్ధానము అనగానే మనకు మొదట గుర్తుకువచ్చే స్త్రీ మగ్దలేనే మరియ. పునరుత్ధాన సందేశాన్ని అందించగల ఆధిక్యత కూడా ఈ స్త్రీకే యివ్వబడింది. (లూకా 24:11).

ఇంత ఆధిక్యతను ప్రభువునుండి పొందుకున్న ఈమె సమాజంలో గౌరవనీయురాలు కాదు, ఏడు దయ్యములు పట్టిన వ్యక్తి. ఏడు దయ్యములు ఆమెను వెంటాడి వేధించిందంటే బహుషా బంధుమిత్రులనుండి, ఇరుగుపొరుగువారి ప్రేమనుండి దూరమైయుండవచ్చు. యేసు క్రీస్తు చేత ఎప్పుడైతే స్వస్థపరచబడినదో ఆనాటి నుండి సిలువమరణం పొందేవరకు వెంబడించింది. తన ఆస్థిపాస్తులన్నీ ప్రభుకార్యానికే వినియోగించింది. శిష్యులందరికంటే ఈమె ఎక్కువగా ప్రభుని ప్రేమించింది. (యోహాను 20:11).

యేసు క్రీస్తు మరణం తరువాత శిష్యులు వారి దారిన వారు వెళ్లారు కాని, అబలయైన మగ్ధల నివాసి మాత్రం ఆ సమాధి స్థలాన్ని వదిలి వెళ్లిపోలేదు. గుండెలు బాదుకుంటూ రోదించించి. తోడుగా మరి కొందరు స్త్రీలను కూడా పిలిచుకుంది. యేసు చెప్పినట్లు మూడవనాడు ఆయన లేస్తాడనే లోతైన విశ్వాసంలో నిరీక్షణ రెట్టింపైంది.

వెదికేవారికి దొరుకుతానన్నాడు క్రీస్తు (మత్తయి 7:8) నన్ను జాగ్రత్తగా వెదకువారు నన్ను కనుగొంటారు (సామె 8:17). మరియ పూర్ణాత్మతో, పూర్ణ మనసుతోనూ వెదకి సజీవుని కనుగొంది. పునరుత్ధానుడిగా ఆయనను చూచింది. తనకున్న నిస్వార్థ ప్రేమ కారణంగా తొలి ప్రత్యక్షత ఆ స్త్రీకే దక్కింది. ప్రేతవస్త్రాలు వదిలి పరిశుద్ధతవైపు ఆమె ప్రస్థానం, శిష్యులందరికంటే అధికంగా ఎంచబడింది. క్రీస్తు శ్రమ, మరణం, భూస్థాపన, పునరుత్ధానములో ఆమె పొందిన సాక్ష్యం, అనేకమంది స్త్రీలను ప్రభువు మార్గంలో నడిపించిన ప్రథమ మహిళా మిషనరీ అయ్యింది. నేటి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచింది ఈ మగ్దలేనే మరియ.

అట్టి ఆదర్శ జీవితం జీవిద్దామా?

Audio Message on Youtube: https://youtu.be/UDt43oGNhA4