సిలువ ధ్యానములు - Day 21 - స్వస్థత
Audio: https://youtu.be/o7JM5deWfoA
యేసు ప్రభువు నలుగుట వలన మనకు కలిగిన లాభాలు
యెషయా 53:5 మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచబడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను
యేసు ప్రభువు నలుగుట వలన మనకు కలిగిన మొదటి లాభము స్వస్థత.
ఈ వాక్యం చదివినప్పుడు నాలో వచ్చిన సందేహం యేసు ప్రభువు నలగడం వలన స్వస్థత ఎలా వస్తుంది? నలుగకుండా స్వస్థత చేయలేడా? ఈ ప్రశ్నలతో ప్రార్ధనలో కనిపెట్టినప్పుడు నాకు వచ్చిన సమాధానం; ఒక మందు తయారు చేయాలంటే వాటిలో వేసేవాటిని నలుగగొడ్తేనే తయారవుతుంది. సుగంధ ద్రవ్యాలు తయారు చేయాలంటే పువ్వులను నలుగగొడ్తేనే తయారవుతుంది. అలాగే మనిషిని బాగుచేయాలంటే, మనిషిని పరిమళ వాసనగా చేయాలంటే క్రీస్తు నలుగగొట్టబడాలి. సిలువలో యేసు ప్రభువు నలుగుట వలన మనకు స్వస్థత వచ్చింది.
మనిషి మూడు రకముల రోగముల చేత బాదపడుతుంటాడు. ఒకటి శరీరిక రోగం, రెండు పాపపు రోగం, మూడు మానసిక రోగం. శరీర సంబంధమైన రోగాలన్నిటికి చికిత్స లేదు. డాక్టర్లు వారు నేర్చుకున్నంత వరకే వైద్యం చేయగలుగుతారు కాని, దానికి మించి ఏదైన రోగం వస్తే, ప్రయోగాలు చేస్తారు కాని, బాగు చేయలేక నీవు నమ్మిన దేవుడే నిన్ను బాగుచేయాలి అంటారు. శారీరిక రోగం మనిషిని ఒంటరిని చేసేస్తాయి. కొన్ని రోగాలకు చికిత్సలేక మరణం కోసం ఎదురు చూసే పరిస్థితి కలుగుతుంది. యేసు ప్రభువు ఈ లోకంలో పరిచర్య చేస్తున్నప్పుడు రోగాలతో బాధపడుతున్న వారు దావీదు కుమారుడా నన్ను కణికరించమని వేదనతో కేకలు పెట్టారు. స్వస్థపరిచేవారు లేక యేసు ప్రభువును వేడుకున్నారు.
మానసిక రోగం బయటకు కనిపించదు. అందరి మధ్యలోవున్నా ఒంటరితనం అనుభవిస్తుంటారు. మానసిక రోగం ప్రతి అవయవమును నలుగగొడుతుంటుంది. అందరి మధ్యలో బాగున్నామనే చెప్తారు కాని, లోపల తీవ్రమైన వేదనతో ఉంటారు. అందరు ఉంటారు కాని, ఎవరు లేనట్లుగానే ఉంటుంది. ఏమి చెయ్యాలో తెలియక, ఎవరికి చెప్పాలో తెలియక లోలోపల కుమిలిపోతు, భయటకు నేను బాగానే ఉన్నానని నటిస్తు బ్రతికుండి చచ్చినట్లు జీవిస్తుంటారు.
పాపపు రోగం; ఇది జీవితమునే చీకటి చేసేస్తుంది. ఇది మరణముతో స్నేహమే. ఈ రోగం ఉన్నవారు నటిస్తునే ఉంటారు. సంతోషం లేకపోయిన సంతోషం ఉన్నట్లు, భయం ఉండికూడ భయం లేనట్లు, నీచమైన జీవితము జీవిస్తూ సమాజములో నాకు గౌరవానికి ఏ మాత్రం తక్కువ లేదని తనను తాను మోసం చేసుకుంటు, మనసును చంపుకుంటు బ్రతుకుతుంటారు.
యెషయా 53:5 ...అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగుచున్నది. సిలువ మీద యేసు ప్రభువు నలిగిన ముద్ద. అది కేవలం మనిషి స్వస్థతకొరకే. మనిషి రోగాలతో బాధపడకూడదనేదే దేవుని ఉద్దేశం. మన ఆరోగ్యం కొరకు, మన స్వస్థత కొరకు వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడు గాను సిలువ మీద వ్రేలాడాడు. కారణం, నాకెవరు లేరని ఒంటరిగా కృంగిపోవద్దని సిలువలో యేసు ప్రభువు చేసిన త్యాగమే మన కొరకు వ్యాధి ననుభవించినవాడు గాను మనుష్యులు చూడనొల్లనివాడుగాను ఉండెను. ఈ రోజు నీవు ఏ రోగముతో ఉన్నా నిన్ను స్వస్థపరచే దేవుడు యేసు ప్రభువొక్కడే.