40 రోజుల సిలువ ధ్యానములు - Day 34 - ఉజ్జీవం
Audio: https://youtu.be/olnmdJU2rLU
సంఘములలోను, ప్రార్ధన గుంపులలోను తరచుగ వినిపించేది ఉజ్జీవం కావాలి, ఆది అపోస్తలుల దినములలో ఉన్న ఉజ్జీవం కావాలి. మరి ఇన్ని సంవత్సరముల నుండి ప్రార్ధిస్తుంటే ఉజ్జీవం వచ్చిందా రాలేదా? సాధారణముగ చాలావరకు ఉజ్జీవం అనగానే ఆనాడు పెంతికోస్తు దినమున మేడగదిలో అగ్ని దిగివచ్చినట్లు దిగిరావాలనుకుంటారు, అద్భుత కార్యములు జరగాలి, స్వస్థతలు జరగాలి, చనిపోయినవారు లేపబడాలని కోరుకుంటారు.
లూకా 9:51-55లో సమరయుల యొక గ్రామములో యేసు ప్రభువుకు బస సిద్ధము చేయవలెనని శిష్యులు ప్రయత్నిస్తే ఆ గ్రామస్తులు చేర్చుకొనలేదు. అప్పుడు యాకోబును యోహానును అది చూచి ప్రభువా, ఆకాశమునుండి అగ్ని దిగి వీరిని నాశనము చేయునట్లు మేమాజ్ఞాపించుట నీకిష్టమా అని యేసు అడిగారు. ఇది యేసు ప్రభువు. సిలువ మరణం పొందక ముందు జరిగిన సంగతి. ఎప్పుడైతే సిలువలో యేసు ప్రభువు ప్రాణం పెట్టాడో, ఎప్పుడైతే సిలువ కార్యం వారిలో జరిగినదో; ప్రధాన యాజకులు యేసు నామమునుబట్టి యెంతమాత్రమును మాటలాడకూడదు, బోధింపనుకూడదని శిష్యులను బెదిరించి కొట్టినప్పుడు ఆకాశమునుండి అగ్ని దిగాలని ప్రార్ధించలేదు కాని, ఆ నామమును బట్టి హింసించబడుచున్నందుకు సంతోషించారు, ఇదే ఉజ్జీవం.
ఉజ్జీవం అంటే అద్భుతములు స్వస్థతలు జరగడం కాదు ఉజ్జీవం అనగా మార్పు. మార్పు ఎక్కడ నుండో కాదు మార్పు నీనుండి మొదలవడమే ఉజ్జీవం. ఎదుటి వారు మారాలనేది ఉజ్జీవం కాదు అది వేషదారితనం. వేషధారి ఎప్పుడు నేను బాగున్నాననే బ్రమలో ఉంటు, ఎదుటి వారు మారాలనుకుంటాడు. ఉజ్జీవం అనగా నేను మారాలి, నా తోటి వారిని క్రీస్తు యొద్దకు నడిపించాలనేది ఉజ్జీవం. ఈ ఉజ్జీవం సిలువ ద్వారానే కలుగుతుంది.
యేసు ప్రభువు మీరే సువార్త చెప్పండి, మీరే మెలుకువ ఉండి ప్రార్ధించమని చెప్పలేదు, మొదట యేసు ప్రభువు సువార్తను ప్రకటిస్తు, మెలుకువ ఉండి ప్రార్ధన ఆయన చేసి అప్పుడు శిష్యులను చేయమని చెప్పాడు అందుకనే ఆ రోజులలో గొప్ప ఉజ్జీవం వచ్చి ఊరూర గొప్ప మార్పు కలిగింది. శిష్యులలో సిలువ కార్యం జరిగిన తరువాత వారు కూడ యేసు వలె మొదట చేసి, ఆ తరువాత చెప్పారు కాబట్టి అపోస్తలుల దినములలో గొప్ప ఉజ్జీవం మొదలై గొప్ప మార్పు కలిగినది. సిలువ అనగా ఉజ్జీవం. ప్రతి కైస్తవుడు సిలువ దృశ్యమును చూస్తేనే ఉజ్జీవముతో ప్రభువును సేవించగలడు, సేవ చేయగలడు, నిరీక్షణ కలిగి జీవించగలడు. ఎవరి జీవితములో సిలువ కార్యం జరుగదో వారు నేను బాగానే ఉన్నాను ఎదుటివారు మారాలని వేషధారుల వలె కంటిలో దూలమును ఉంచుకొని ఎదుటివారి కంటిలో నలుసును చూస్తారు. మనమైతే సిలువ దృష్యమును చూసి ఉజ్జీవముతో సాగిపోవుదము.