40 సిలువ ధ్యానములు - Day 36 - రక్షణ
AUdio: https://youtu.be/4zVRnUW675Q
లూకా 23:43 అందుకాయన వానితో నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను.
సిలువలో యేసు ప్రభువుతో పాటు ఇద్దరు దొంగలు ఉన్నారు. ఇద్దరివి వేరువేరు స్వభావములు. ఒక దొంగ దేవునికి ఆఫర్ ఇచ్చాడు, రెండో దొంగ దేవుని వేడుకొన్నాడు. ఒక దొంగ నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మునుకూడ రక్షించుమని చెప్పాడు. వీడి ఉద్దేశం నీవు నిజముగ దేవుని కుమారుడవని రుజువు చేస్తే నిన్ను నమ్ముతా. వీడిలో దేవుని భయమే లేదు. ఈ రోజులలో ఎక్కువమంది ఈ దొంగలాగే ప్రవర్తిస్తుంటారు. ఉద్యోగం ఇస్తే బాప్తీస్మం తీసుకుంటా, నా కుమార్తెకు వివాహం అయితే నమ్ముతా. దేవుని దగ్గర నుండి ఏదైన రుజువు చూస్తేనే నమ్ముతానని చెప్తారు. రుజువులు కోరేవారు, ఏదైన మంచి జరుగుతేనే నమ్ముతామనేవారు అబద్దికులు. మారాలనే ఉద్దేశం వారిలో ఎంత మాత్రం ఉండదు కేవలం తప్పించుకొనుటకే ఎదైన అద్భుతం జరుగుతే నమ్ముతామని సాకులు చెప్తారు.
మత్తయి 27:41 ఆలాగే శాస్త్రులును పెద్దలును ప్రధానయాజకులును కూడ ఆయనను అపహసించుచు 42 వీడు ఇతరులను రక్షించెను, తన్ను తానే రక్షించుకొనలేడు; ఇశ్రాయేలు రాజుగదా, యిప్పుడు సిలువమీదనుండి దిగినయెడల వాని నమ్ముదుమని చెప్పారు. (మత్తయి 28:11-14) ఎప్పుడైతే కావలి వారు యేసు ప్రభువు లేచాడని చెప్పినప్పుడు, నమ్ముతామని చెప్పినవారు నమ్మకుండ సైనికులకు చాల ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రివేళవచ్చి అతనిని ఎత్తికొనిపోయిరని చెప్పమన్నారు. సిలువను దిగితే నమ్ముతామనిన శాస్త్రులు, ప్రధానయాజకులు సత్యమును దాచిపెట్టారు. దేవుని నుండి ఏదైన అద్భుతం జరుగుతే నమ్ముతామని చెప్పేవారు, ఒకటి కాదు ఎన్ని అద్భుతములు జరిగిన నమ్మరు.
ఆ కల్వరి సిలువ మీద రక్తముతో తడిసిపోయి కొన ఊపిరితోవున్న యేసయ్యను చూస్తున్న మరొక దొంగలో తనకి సృష్టికర్త కనిపించాడు, తనను రక్షించగల దేవుడు కనిపించాడు. ఈ దొంగలో దేవుని భయం ఉంది, పాప పశ్చాతాపం ఉంది, తన ప్రక్కన ఉన్న యేసయ్య అసమర్ధుడు కాదు నన్ను రక్షించగల సమర్ధుడని లోకరక్షకుడని విశ్వసించాడు. యేసు ప్రభువు రక్త ప్రవాహంలో మొదట కొట్టుకెళ్ళి పోయింది ఈ దొంగనే. సిలువలో క్రీస్తు శ్రమలను అందరు దూరం నుండి చూస్తున్నారు కానీ దగ్గరనుండి చూసింది ఈ దొంగనే.
పరలోకం వెళ్లాలంటే బాగా వాక్యం చదివి, బాగా ప్రార్ధన చేసి, సంఘానికి క్రమముగా వస్తూ, క్రీస్తు శరీరమునకు రక్తమునకు సాదృష్యమైన బల్లలో చెయ్యి వేస్తూ, దశమ భాగాలు ఇస్తే కాదు. పాప క్షమాపణ కలిగియుండి, క్రీస్తు రక్తములో కడగబడి, పాత జీవితమును విడువాలి. ఇవి లేకుండా పైనవన్నీ చేస్తే పరలోక ప్రవేశముండదు.
క్రీస్తు మధ్యఆకాశమునకు వచ్చినప్పుడు, ఆ బూర ఊదినప్పుడు సంఘం ఎంత శాతం ఎత్తబడుతుంది? ఇద్దరు తిరగలి విసరుతుంటారు ఒకరు విడువబడతారు ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు పొలంలో ఉంటారు ఒకరు విడువబడతారు ఒకరు ఎత్తబడతారు. ఇద్దరు సిలువ మీద ఉన్నారు ఒకరు ఎత్తబడ్డారు ఒకరు విడువబడ్డారు. ఈ వాక్య భాగములు గమనిస్తే 50 శాతం మాత్తమే అనగా దేవుని భయం, పాప పశ్చాతాపం, దేవునిపై విశ్వాసము గలవారే ఎత్తబడతారు.
ఈ రోజు నీవు దేవుని నుండి రుజువులు కోరేవానిగ ఉన్నావా లేదా దేవుని భయం కలిగి పాపమును కప్పుకొనక పశ్చాత్తాపపడి దానిని విడిచి, దేవుని మీద ఆధారపడేవానిగా ఉన్నావా? “నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాననెను” ఈ వాగ్ధానంగా కావాలంటే నీ నిర్ణయం, నీ స్వభావం మీద ఆధారపడివుంది.