యేసు సిలువలో పలికిన యేడు మాటలు - అయిదవ మాట


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

మదర్ థెరిస్సా తన ఆశ్రమంలోని ప్రార్ధనా గదిలో గోడపై "దప్పిగొనుచున్నాను" అనే ఆంగ్ల భాషాలో పదాలు వ్రాసియుండేవట. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మాటలుంటే మీరెందుకు కేవలం ఈ చిన్న పదమే వ్రాసారని ఆమెను అడిగితే ఆమె ఇచ్చిన జవాబు "ఆత్మలకొరకైన దాహం".

యేసు క్రీస్తు అనేక సందర్భాల్లో తాను దప్పిక కలిగియున్నాడని గమనించగలం. "నేను దప్పి గొంటిని, మీరు నాకు దాహమియ్యలేదను" సంగతి వివరిస్తూ మిక్కిలి అల్పులైన వారి దాహమును తీర్చితే నాకు తీర్చినట్టేనని ప్రభువు బోధించాడు. అనగా మన సమాజంలో బలహీనులైనటువంటి వారికి మనవంతు సహాయం చేయడం ధన్యకరం. మదర్ థెరిస్సా ఆలోచనలు కూడా ఇవే.

దాహమునకు కొన్ని నీళ్లు ఇవ్వమని సమరయ స్త్రీతో యేసు పలికిన మాటలు తన శారీరక దప్పికను గూర్చి కాదు గాని ఆత్మీయ దప్పిక అని గమనించగలం. యూదులు మాత్రమే కాదు సమరయులు కూడా రక్షించబడాలనే ఉద్దేశం ఆ స్త్రీ ద్వారా సమరయుల మధ్య సువార్త ద్వారాలు తెరువబడ్డాయి. ఎప్పుడైతే రాబోయే మెస్సయ్య యేసయ్యేనని కనుగొన్నదో తన జీవితాన్ని క్రీస్తుకు అంకితం చేసుకుంది. సమరయయంతట సువార్తను ప్రకటించింది.

"నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పిగొనడు; నేను వానికిచ్చు నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని" సమరయ స్త్రీతో చెప్పిన దేవుడు సిలువలో దప్పిగొనుచున్నాడు. ఆశ్చర్యంగా ఉంది కదా!

సిలువలో తన పని సంపూర్ణమైనప్పుడు "దప్పిగొనుచున్నాను" అను మాట, రక్షించబడిన మన ఆత్మలు తన దగ్గరకు రావాలనే ఆత్మీయ దప్పిక.

కలువరిలో క్రీస్తు పొందిన శ్రమ మనకొరకేనని గ్రహించి ఆ సిలువ యొద్దకు చేరి రక్షించబడిన అనుభవం కలిగియున్నమనం ఆ శ్రమను అనేకులకు వివరించే ప్రయత్నంతో సిలువలో క్రీస్తు దాహమును తీర్చినవారమవుతాము.
ప్రయత్నిద్దామా?