John - యోహాను సువార్త 17 | View All

1. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశమువైపు కన్నులెత్తి యిట్లనెను - తండ్రీ, నా గడియ వచ్చియున్నది.

కుమారుడైన దేవుడు భూలోకంనుంచి మనిషిగా (యోహాను 1:14) పరలోకంలోని తండ్రి అయిన దేవునికి ప్రార్థన చేయడం ఇక్కడ చూస్తున్నాం. అయితే 5వ వచనాన్ని బట్టి ఆయన శాశ్వతుడైన దేవ కుమారుడుగా మాట్లాడుతున్నాడని స్పష్టంగా ఉంది. ఆయన తండ్రికి వేరుగా ఉన్న వేరొక వ్యక్తి అని ఈ ప్రార్థన అంతా తేటగా తెలియజేస్తున్నది. మత్తయి 3:16-17; ఫిలిప్పీయులకు 2:6 కూడా చూడండి. బైబిలంతటిలోకీ ఈ ప్రార్థన అత్యంత గంబీరమైన గొప్ప అధ్యాయాల్లో ఒకటి. బహుశా ఇది అన్నిటికన్నా అసాధారణమైన ధన్యకరమైన అధ్యాయం. దేవుడూ మనుషుడూ అయి ఉన్న వ్యక్తిగానూ, దేవునికీ మనుషులకూ ఏకైక మధ్యవర్తిగానూ (1 తిమోతికి 2:5), తన ప్రజల ప్రముఖయాజిగానూ (హెబ్రీయులకు 4:14-16; హెబ్రీయులకు 7:24-25) యేసు ఈ ప్రార్థన చేశాడు. ఈ ప్రార్థనలో ఆయన తనగురించీ (వ 1,5), తనలో విశ్వాసుల గురించీ మాత్రమే దేవునికి విన్నపాలు చేశాడు గానీ ఇతరుల గురించి కాదు (వ 9,20). తన కోసం ఒకే ఒక సంగతి అడిగాడు. విశ్వాసుల కోసం పాపవిముక్తి, శాశ్వత ధన్యత భద్రంగా ఉండేందుకు అవసరమైన వాటన్నిటినీ అడిగాడు. తండ్రి అయిన దేవుడు వారిని కాపాడాలనీ (వ 11-16), పవిత్రపరచాలనీ (వ 20-23), తన మహిమను చూడగలిగేలా చివరికి వారిని పరలోకంలో చేర్చుకోవాలనీ (వ 24) ప్రార్థించాడు. క్రీస్తు కేవలం దేవుని సంకల్పం ప్రకారం మాత్రమే ప్రార్థించేవాడు కాబట్టి తండ్రి అయిన దేవుడు తన కుమారుని కోసం ఈ విన్నపాలన్నిటి ప్రకారం చేస్తాడు (యోహాను 11:24; 1 యోహాను 5:14-15 చూడండి). తాను ప్రార్థనలో విశ్వాసులకోసం అడిగినవన్నీ వారివేనని వారు గ్రహించి ఆనందించాలని యేసు ప్రార్థించాడు (వ 13). క్రొత్త ఒడంబడిక గ్రంథంలో రాసి ఉన్న ఆయన ప్రార్థనల్లో కొద్దిగా దీర్ఘమైనది ఇదొక్కటే. క్రీస్తు అన్నిటిలోకీ అతి ప్రధానంగా ప్రియంగా ఎంచినవి మాత్రమే ఈ ప్రార్థనలో కనిపిస్తున్నవి. ఈ విధంగా మనం దేవుని ప్రజలను తలుచుకుని కొంతవరకు ఏమి ప్రార్థించాలో ఇక్కడ నేర్చుకోవచ్చు (అయితే మానవ మాత్రులం కాబట్టి ఈ ప్రార్థనలో కనిపించే మాటలన్నిటినీ మనం ఉపయోగించలేము గదా). ఆయన విశ్వాసులకు కలగాలని ఆశించిన వాటన్నిటినీ మనం ఆశించాలి. “సమయం వచ్చింది”– యోహాను 7:30; యోహాను 12:23. “మహిమ చేకూర్చు”– యేసు తనకోసం దేవుణ్ణి వేడుకున్న ఒకే ఒక విషయం. వ 5లో దీని భావమేమిటో మరింత వివరంగా తెలియజేశాడు. విశ్వ సృష్టికి మునుపు తనకున్న మహిమలోకి తిరిగి ప్రవేశించాలనీ, తాను ఈ లోకానికి వచ్చినప్పుడు వదులుకున్న స్థితి, ఘనత హోదాలను తిరిగి పొందాలనీ కోరాడు (ఫిలిప్పీయులకు 2:5-7; 2 కోరింథీయులకు 8:9 చూడండి). మరణం తరువాత తనను సజీవంగా తిరిగి లేపి పరలోక మహిమలో దేవుని కుడివైపుకు తిరిగి హెచ్చించమనీ దేవుణ్ణి అడుగుతున్నాడు. దీన్నే మరో విధంగా చూడాలంటే మహిమ చేకూర్చడం అంటే, ఒక వ్యక్తిని ఉన్నత స్థానానికి హెచ్చించి, ఘనపరచి, గొప్పవాడిగా అందరూ గుర్తించేలా చెయ్యడం. ఆ విధంగా తన నిజ స్వభావాన్ని లోకంలోని మనుషులంతా గుర్తించేలా చెయ్యమని యేసుప్రభువు దేవుణ్ణి అడిగాడు. అంటే తాను దేవుని అవతారమనీ లోక రక్షకుడనీ వారికి తెలియజేయాలని అడిగాడు. మహిమ ఘనతలను స్వార్థం కోసం సంపాదించుకోవాలని చూచే మనసు కాదిది (ఫిలిప్పీయులకు 2:5-7 మళ్ళీ చూడండి). తనకు మహిమ చేకూర్చవలసినదని క్రీస్తు తండ్రిని అడగడానికి చాలా ప్రముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది అందుకు తగిన సమయం ఇప్పుడు వచ్చింది. మరుసటి రోజు ఆయన మరణించనున్నాడు. క్రీస్తు పరలోకంలో తన మహిమను వదిలి పాపులకోసం బాధలు, మరణం అనుభవించి తిరిగి మహిమలోకి ప్రవేశించాలన్నది దేవుడు నియమించిన ఏర్పాటు (లూకా 24:26). రెండో కారణం, తండ్రికి తాను మహిమ చేకూర్చగలిగేలా తండ్రిని తనకు మహిమ చేకూర్చవలసిందని అడుగుతున్నాడు. తన సొంత మహిమను తనకోసం ఆయన కోరలేదు. తండ్రికి మహిమ చేకూర్చలేని ఎలాంటి మహిమనూ ఆయన తనకు కలగాలని ఎన్నటికీ కోరేవాడు కాదు (యోహాను 7:18; యోహాను 8:50). తన కుమారుని శత్రువులు ఆయన్ను ఓడిస్తే, మరణం ఆయన్ను సమాధిలో బంధిస్తే అది తండ్రికి ఏమాత్రం మహిమ కలిగించదు. మూడోదిగా, దేవుడు క్రీస్తుకిచ్చిన అధికారాన్ని ఆయన ఉపయోగించి దేవుని పని (వ 2) సాధించాలంటే తండ్రి ఆయనకు మహిమ చేకూర్చడం అవసరం. తండ్రి ఆయన్ను సజీవంగా లేపి దేవుని కుడివైపున కూర్చోబెట్టకపోతే ఇలా చేయడం సాధ్యం కాదు. అందువల్ల కేవలం తండ్రికోసం మాత్రమే గాక, విశ్వాసులందరి కోసమూ కూడా ఆయనకు మహిమ చేకూరాలని కోరాడు. దేవుని మహిమ, క్రీస్తు మహిమ, ఆయన ప్రజల మేలు – ఈ మూడూ ఒకదానికొకటి దగ్గర సంబంధం గలవి.

2. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమ పరచుము. నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికిని ఆయన నిత్యజీవము అనుగ్రహించునట్లు సర్వశరీరులమీదను ఆయనకు అధికారమిచ్చితివి.

“అధికారం”– యోహాను 3:35; మత్తయి 28:18. ఆయనకు అధికారం ఇవ్వడంలో గల ఉద్దేశం చూడండి (విశ్వాసులకు శాశ్వత జీవాన్ని ఇవ్వడం – యోహాను 3:16; యోహాను 5:21; యోహాను 6:40). ఈ లోకంలో యేసుప్రభువుకున్న అపరిమిత అధికారం చూడండి. తండ్రి తనకు ఇచ్చినవారందరికీ శాశ్వత జీవం కలగడం అనే ఫలితాన్ని సాధించడం కోసం ఆయన ఈ లోకంలోని అన్ని దేశాల్లో, జాతులమధ్య పరిస్థితులను అనుకూలంగా మార్చగలడు. మనుషుల హృదయాల్లో మనసుల్లో పని చేయగలడు.

3. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును, నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము.

“ఏకైక సత్యదేవుడనైన”– ఇక్కడ యేసు తనను, పవిత్రాత్మను దేవత్వంలో నుంచి వేరు చేయడం లేదు. అబద్ధ దేవుళ్ళనూ, మనుషులు చేసిన విగ్రహాలనూ మాత్రమే ఆయన వేరు చేస్తున్నాడు (కీర్తనల గ్రంథము 115:3-8; యెషయా 44:6, యెషయా 44:8; యెషయా 45:18). దేవుణ్ణి తెలుసుకోవడం ఎలా శాశ్వత జీవమో తనను తెలుసుకోవడం కూడా అలానే శాశ్వత జీవమని అనడంలోనే ఆయన తనను కూడా దేవునితో కలిపి మాట్లాడుతున్నాడు (యోహాను 8:19; యోహాను 14:8-9 చూడండి). శాశ్వత జీవం యేసులో ఉంది (1 యోహాను 5:11). అసలు శాశ్వత జీవమంటే యేసే (యోహాను 11:25; యోహాను 14:6; 1 యోహాను 5:20). ఈ జీవం మనకు కలగాలంటే ఆయన్ను మనం తెలుసుకోవాలి. సరైన వ్యక్తిని తెలుసుకోవడమే నిజ క్రైస్తవానికి ఆయువుపట్టు – ఎఫెసీయులకు 4:17-18; 2 పేతురు 1:3; 2 పేతురు 3:18. యేసుప్రభువు చెప్తున్న ఈ జ్ఞానం అద్వైత వేదాంతం చెప్తున్న ఆత్మజ్ఞానం లాంటిదేదీ కాదు (యోహాను 15:21 మొదలైన చోట్ల నోట్స్ చూడండి). ఏకైక నిజ దేవుణ్ణి నిజంగా ఎరిగినవారు తాము కేవలం మనుషులమేనని, దేవునిచేత సృష్టించబడినవారమేననీ అన్ని విధాలా దేవునికంటే చెప్పరాని రెట్లు అల్పులమేననీ తెలుసుకుని ఉంటారు. “శాశ్వత జీవం”– (యోహాను 3:16. ఇదేమిటో యేసు చెప్పినది ఇక్కడ ఒక్క చోటే. దేవుణ్ణి తెలుసుకోవడంవల్ల కలిగే ఫలితం శాశ్వత జీవం అనలేదు ఆయన. దేవుణ్ణి తెలుసుకోవడమే శాశ్వత జీవం అన్నాడు. ఈ జ్ఞానం ఎవరిలోనూ సహజంగా లేదు ((యోహాను 15:21; (యోహాను 16:3; 2 కోరింథీయులకు 4:4; ఎఫెసీయులకు 4:17-18). మనుషులకు శాశ్వత జీవాన్ని ఉచితంగా ఇవ్వడంలో యేసుప్రభువు వారికి తండ్రి అయిన దేవుణ్ణీ, తననూ తెలుసుకునేలా చేస్తున్నాడు (మత్తయి 11:27 పోల్చి చూడండి). శాశ్వత జీవమంటే కేవలం అనంతకాలం జీవించడం మాత్రమే కాదు. ఇదొక విశేషమైన జీవం – అంటే దేవునితో సహవాసం చేయడం, ఆయన్ను ఎరిగి ఉండడం, ఆయనకు విధేయత చూపుతూ, ఆయనను నమ్ముతూ, ఘనపరుస్తూ, ప్రేమిస్తూ, సేవిస్తూ ఉండడం (ప్రకటన గ్రంథం 21:3; ప్రకటన గ్రంథం 22:3-5 పోల్చి చూడండి). ఇలా దేవుణ్ణి తెలుసుకోవడం అనే ఈ జ్ఞానం దేవుని నుంచి నేరుగా వచ్చేది. ఇది మనోవికాసం, జ్ఞానప్రకాశాలను కలిగించే అనుభవం (2 కోరింథీయులకు 4:6).

4. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమిమీద నిన్ను మహిమ పరచితిని.

క్రీస్తు ఉద్దేశం ఎప్పుడూ పరమ తండ్రికి మహిమ కలిగించడమే. దీన్ని ఆయన నెరవేర్చాడు (యోహాను 4:34; యోహాను 7:18; యోహాను 8:29).

5. తండ్రీ, లోకము పుట్టకమునుపు నీయొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీయొద్ద మహిమ పరచుము.

ప్రపంచం ఉనికిలోకి రాకముందే తానున్నానని యేసు తానే ఇక్కడ స్పష్టంగా ప్రకటిస్తున్నాడు (యోహాను 1:1-3; మీకా 5:2 చూడండి). క్రీస్తు తండ్రికి వేరుగా ఉన్న ఒక ప్రత్యేక వ్యక్తి అని ఇది తేటతెల్లం చేస్తున్నది కూడా. దేవుడు తన కుమారుడు చేసిన ఈ ప్రార్థనకు జవాబిచ్చాడు. అపో. కార్యములు 2:32-33; అపో. కార్యములు 3:13-15; ఫిలిప్పీయులకు 2:9-11 చూడండి.

6. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని. వారు నీవారై యుండిరి, నీవు వారిని నాకను గ్రహించితివి; వారు నీ వాక్యము గైకొని యున్నారు.

“నీవు నాకిచ్చినవారు”– తనలో నమ్మకం ఉంచినవారి గురించి ఆయన మాట్లాడుతున్నాడు. వ 6-10లో వారి గురించి తొమ్మిది సంగతులు చెప్పాడు. వ 14,18లో మరో మూడింటిని జోడించాడు. ఈ విషయాలన్నీ విశ్వాసులందరి విషయంలోనూ నిజమే. వారి పాపం, అల్ప విశ్వాసం, అసంపూర్ణమైన విధేయత గురించి ఆయన ఇక్కడ మాట్లాడ్డం లేదు. తన ప్రజల నేరాలు తండ్రికి చెప్పడు. తండ్రి ఎదుట వారి పక్షంగా వాదిస్తాడు (రోమీయులకు 8:33-34; 1 యోహాను 2:1). వీలైనంతవరకు వారిని గురించి క్రీస్తు ఉన్నతమైన ఆలోచనలు కలిగి తండ్రి ఎదుట వారిని సాధ్యమైనంత ఉత్తములుగా నిలబెడతాడు. “వారికి నీ పేరును వెల్లడి చేశాను”– యోహాను 1:18; మత్తయి 11:27. అంటే దేవుని స్వభావాన్నీ ఆయన లక్షణాలనూ పూర్తిగా తెలియజేశాడు. నిర్గమకాండము 34:6-7 చూడండి. దేవుడు ఎలాంటివాడో కేవలం మాటలతో గాక చేతలతో జీవితం ద్వారా యేసుప్రభువు వారికి వెల్లడి చేశాడు. దేవుడు ఈ లోకంలో నుంచి వారిని ఎన్నుకున్నాడు. విశ్వాసులు స్వభావ సిద్ధంగా ఇతరులకన్న మంచివారేమీ కాదు. వారందరూ భ్రష్ట మానవజాతికి చెందినవారే. దేవుడు వారిని ఎన్నుకునేందుకు వారిలో మంచి గానీ పవిత్రత గానీ ఏమీ లేదు (రోమీయులకు 3:9, రోమీయులకు 3:19; ఎఫెసీయులకు 2:1-3). కానీ దేవుడు వారిని ఈ లోకం విడిచి క్రీస్తు వెంట రమ్మని పిలిచాడు (గలతియులకు 1:3). వారు ఇక ఈ లోకానికి చెందినవారు కాదు (వ 14; ఫిలిప్పీయులకు 3:20). మొదట వారు తండ్రి అయిన దేవునికి చెందినవారు. ఒక విధంగా చూస్తే దేవుడు అందరినీ సృష్టించినందువల్ల మనుషులంతా ఆయనకు చెందినవారే (యెహెఙ్కేలు 18:4). కానీ విశ్వాసులు ఒక ప్రత్యేకమైన రీతిలో దేవుని సొత్తు – అపో. కార్యములు 18:10; 1 కోరింథీయులకు 6:19-20; ఎఫెసీయులకు 1:4; 1 పేతురు 1:2 (నిర్గమకాండము 19:4-6; ద్వితీయోపదేశకాండము 7:6 పోల్చి చూడండి). లోకం ఉనికిలోకి రాకమునుపు ఆయన వారిని ఎన్నుకున్నాడు. దేవుడు వారందరినీ యేసుప్రభువుకు ఇచ్చాడు. విశ్వాసులు దేవుడు తన కుమారునికి ఇచ్చిన ప్రేమ బహుమతి. ఆయన తనతో ఉంచుకుంటూ, చూస్తూ, ఆనందిస్తూ ఉండడానికి దేవుడిచ్చిన విశేషమైన నిధి. అలాంటప్పుడు వారిలో ప్రతి ఒక్కరూ క్షేమంగా పరలోకంలో చేరేవరకు వారిని జాగ్రత్తగా సంరక్షించడా? అవును. సంరక్షిస్తాడు – వ 11,12; యోహాను 10:28 చూడండి. విశ్వాసులు దేవుని వాక్కుకు “విధేయులయ్యారు” అంటున్నాడు క్రీస్తు. అక్షరాలా దేవుని మాటలు అయిన క్రీస్తు మాటను వారు విన్నారు. ఆయనకు లోబడ్డారు. వారు లోపం లేనివారు కారు. లోపం లేకుండా దేవుని వాక్కుకు విధేయత చూపలేదు. కానీ వారి కోరిక, జీవితాశయం పూర్తిగా విధేయత చూపడమే. క్రీస్తు వారి తప్పులను పట్టించుకోకుండా వారు “విధేయులయ్యారు” అంటున్నాడు. విశ్వాసులందరి విషయంలోనూ ఇది నిజమే. విశ్వాసులమని చెప్పుకొని కనీసం కొన్ని ముఖ్యమైన విషయాల్లోనైనా దేవుని వాక్కుకు లోబడని వారి సంగతేమిటి? వారు నిజ విశ్వాసులు కారు (యోహాను 8:31, యోహాను 8:47; యోహాను 10:26-27; మత్తయి 7:21; 1 యోహాను 2:3-4).

7. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చి యున్నాను; వారామాటలను అంగీకరించి, నేను నీయొద్దనుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి, నీవు నన్ను పంపితివని నమ్మిరి గనుక

విశ్వాసులందరి గురించి ఈ రెండు వచనాలు మరి కొన్ని విషయాలను వెల్లడిస్తున్నాయి. కొన్ని సత్యాలను వారు గ్రహిస్తారు, స్వీకరిస్తారు, నమ్ముతారు. దేవుడు యేసును పంపాడనీ, యేసు చేసినవీ చెప్పినవీ అన్నీ దేవుని మూలంగానేననీ వారికి తెలుసు. క్రీస్తు చెప్పిన మాటలు పరమ తండ్రినుంచి వచ్చాయని వారు వాటిని సంతోషంతో అంగీకరిస్తారు. తాము నమ్మినవన్నీ యేసుక్రీస్తు తిరుగులేని అధికారాన్ని బట్టి నమ్ముతారు. వాటన్నిటికీ మార్పు చెందని ఆధారం ఆయనే అని వారికి తెలుసు.

8. నీవు నాకు అనుగ్రహించిన వన్నియు నీవలననే కలిగినవని వారిప్పుడు ఎరిగి యున్నారు.

9. నేను వారికొరకు ప్రార్థన చేయుచున్నాను; లోకముకొరకు ప్రార్థన చేయుటలేదు, నీవు నాకు అనుగ్ర హించి యున్నవారు నీవారైనందున వారికొరకే ప్రార్థన చేయుచున్నాను.

విశ్వాసుల గురించి ఇక్కడ చెప్పిన సత్యాలలో ఏడోది – క్రీస్తు వారిని తన ప్రత్యేక ప్రార్థన అంశంగా చేసుకుంటాడు. వారికోసం ప్రార్థించిన రీతిలో అవిశ్వాసులకోసం ప్రార్థించలేడు, ప్రార్థించడు.

10. నావన్నియు నీవి, నీవియు నావి; వారియందు నేను మహిమపరచబడి యున్నాను.

విశ్వాసుల గురించిన ఎనిమిదో సత్యం ఇది. వారిద్వారా క్రీస్తుకు మహిమ చేకూరుతుంది. ఆయన ప్రేమ, కరుణలకు ఆయన వారికోసం మరణించడం మూలంగా మహిమ కలుగుతుంది. వారికి పాపవిముక్తి ప్రసాదించి వారిని మార్చడంలో ఆయన ప్రభావం, కృపలకు మహిమ కలుగుతుంది. వారి బలహీనతలను సహించి ఊరుకోవడంలో ఆయన సహనానికి మహిమ చేకూరుతుంది. లోకానికి వారు చెప్తున్న సాక్ష్యంలో ఆయన పేరుకు మహిమ చేకూరుతుంది. వారిలో బలహీనత, భ్రష్ట స్వభావం ఉన్నాయి. అయినప్పటికీ క్రీస్తుకు వారి మూలంగా మహిమ కలుగుతుంది. వారిని ఎన్నుకోవడంలో దేవునికి ఉన్న గొప్ప ఉద్దేశాల్లో ఇది ఒకటి – ఎఫెసీయులకు 1:5-6, ఎఫెసీయులకు 1:12. విశ్వాసుల మూలంగా తండ్రికి, కుమారునికి కూడా మహిమ చేకూరుతుంది. మనం ఈ సత్యాన్ని మనసులో పెట్టుకుని అన్నిటిలోనూ వారిద్దరికీ మహిమ కలిగేందుకు సంతోషంతో పూనుకోవాలి (1 కోరింథీయులకు 10:31).

11. నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు; నేను నీయొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడవైన తండ్రీ, మనము ఏకమై యున్నలాగున వారును ఏకమై యుండు నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము.

దేవుడు యేసుకు తన సొంత “పేరును” ఇచ్చాడు (యోహాను 5:26-27 పోల్చి చూడండి). దేవుడు తన స్వభావం, అధికారం, ప్రభావం యేసుక్రీస్తుయొక్క మానవ దేహంలో ఉండేలా దయచేశాడు (కొలొస్సయులకు 2:9). ఈ వచనంలో యేసు విశ్వాసుల కోసం చేసిన మొదటి విన్నపం కనిపిస్తున్నది. వ 15లో దీన్నే వేరే మాటల్లో మళ్ళీ చెప్పాడు. వారు యూదా ఇస్కరియోతులాగా నశించిపోకుండా (వ 12) దేవుడు వారిని కాపాడాలనీ, దుర్మార్గతనుంచి సంరక్షించాలనీ ఆయన్ను వేడుకుంటున్నాడు. దేవుడు విశ్వాసులను కాపాడుతూ ఉండవలసిన కారణం ఒకటి ఇక్కడ కనిపిస్తున్నది. వారింకా “లోకంలో ఉన్నారు”. దేవుడు వారిని లోకంనుంచి ఎన్నుకున్నాడు (వ 6). వారు లోకానికి చెందినవారు కాదు (వ 4), కానీ వారు ఇంకా లోకంలోనే ఉన్నారు. లోకం వారినింకా ద్వేషిస్తూ ఉంది. (వ 14). లోకంనిండా విషమ పరీక్షలు, దుష్‌ప్రేరేపణలు, మోసపుచ్చే ఆత్మలు, అపాయాలు (1 పేతురు 5:8) ఉన్నాయి. లోకం సత్యానికీ, నమ్మకానికీ, దేవుణ్ణి ప్రేమించడానికీ, విశ్వాసికి అమూల్యమైన వాటన్నిటికీ విరోధి. 1 యోహాను 5:19 చూడండి. ఆధ్యాత్మికంగా చూస్తే అది చీకటితో, మురికితో నిండిన ప్రదేశం. దాన్లో మనం అశుద్ధమైపోవడం, దారి తప్పడం తేలిక. విశ్వాసులైతే తరచుగా బలహీనులుగా, తెలివితక్కువవారుగా ఉండి తమ భ్రష్ట స్వభావాలతో పెనుగులాడుతూ ఉంటారు (రోమీయులకు 7:18; గలతియులకు 5:17; 1 యోహాను 1:8) – వారిని లోకానికీ సైతానుకూ పట్టియివ్వబూనుకునేదేదో వారిలోనే ఉంది (రోమీయులకు 7:23). ఇలాంటప్పుడు విశ్వాసులు భద్రంగా ఎలా ఉండగలుగుతారు? తన కుమారుని ప్రార్థనలకు జవాబుగా దేవుడు వారిని కాపాడుతాడు కాబట్టి వారికి పూర్తి భద్రత ఉంది. లూకా 22:31; రోమీయులకు 5:10; హెబ్రీయులకు 7:25 చూడండి. ఆయన సర్వశక్తి వారి పక్షంగా పని చేస్తున్నది – 1 పేతురు 1:4-5; సామెతలు 18:10. ఆయన వారిలో మంచి పని ఆరంభించాడు. దాన్ని ఆయనే సమాప్తం చేస్తాడు – ఫిలిప్పీయులకు 1:6. విశ్వాసులను భద్రంగా ఉంచడంలో కుమారుడైన యేసు పరమ తండ్రితో కలిసి పని చేస్తున్నాడు. యేసుప్రభువు వారిని భద్రంగా తనతో ఉంచుకోవాలన్నది దేవుని తిరుగులేని సంకల్పం (యోహాను 6:39). ఈ విషయంలో దేవుని సంకల్పాన్ని యేసు నెరవేర్చకుండా ఉంటాడా? యోహాను 4:34 పోల్చి చూడండి. విశ్వాసులు ఆయన సంరక్షణలో ఉన్న గొర్రెలు. ఆయన వారిని కాపాడకుండా ఉంటాడా? యోహాను 10:28 చూడండి. ఆయన వారికోసం అస్తమానం ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రార్థనలను దేవుడు వినడా? యోహాను 11:42 చూడండి. క్రీస్తు ప్రార్థనలకు దేవుడు జవాబియ్యడమన్నది విశ్వాసుల మంచి ప్రవర్తనపై ఆధారపడదు. వారి మంచి ప్రవర్తన, విశ్వాసంలో కొనసాగడం అన్నది ఆయన ప్రార్థనలపై ఆధారపడి ఉంది.

12. నేను వారియొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించినవారిని నీ నామమందు కాపాడితిని; నేను వారిని భద్రపరచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు.
కీర్తనల గ్రంథము 41:9, కీర్తనల గ్రంథము 109:8

ఈ భూమిపై ఉన్నప్పుడు యేసుప్రభువు తన విశ్వాసులందరినీ భద్రంగా కాపాడాడు. ఆయన వారిని బలహీనతనుంచి బుద్ధి హీనతనుంచి, చెడు విషయాల గురించిన ప్రేరేపణలు, విషమ పరీక్షలనుంచీ, ఆ మాట కొస్తే పాపం చేయడానికి అవకాశాలన్నిటి నుంచీ వారిని రక్షించలేదు (యోహాను 18:10-11; యోహాను 19:25; లూకా 22:24, లూకా 22:31-32; లూకా 24:25; మత్తయి 16:22-23; మత్తయి 26:69-75). వారు ఘోరమైన తప్పుల్లో పడుతూ ఉన్నప్పటికీ యేసు వారిని కాపాడుతున్నాడు. అంటే వారు పాపం చేసినా కూడా ఆయన వారిని రక్షణ స్థితిలో, ముక్తిమార్గంలో ఉంచుతూ వచ్చాడు. వారిలో బలహీనమైన నమ్మకం, అప్పుడప్పుడూ అపనమ్మకం ఉన్నా కూడా తనపై నమ్మకం చెదరకుండా ఉన్న స్థితిలోనే ఉంచాడు. యేసు తాను వారిని కాపాడిన విధంగానే కాపాడవలసిందని దేవుణ్ణి అడుగుతున్నాడు. యూదా ఇస్కరియోతును (“నాశనానికి తగినవాడే”) కాపాడలేకపోయాడా? విశ్వాసులను కాపాడ్డంలో ఒక్క యూదాను ఆయన మినహాయించాడా? అతణ్ణి విశ్వాసంలో ఉంచలేక పోయాడా? అలా కాదు. యూదాలో నిజమైన విశ్వాసం ఎప్పుడూ లేదు. దేవుడు యూదాకు పాపవిముక్తి కలిగించి అతన్ని తనకు ఇచ్చాడనీ, తాను యూదాను పోగొట్టుకున్నాననీ యేసు అనడం లేదు. వ 6-10లో నిజ విశ్వాసుల వర్ణన చూడండి. యేసుకు దేవుడిచ్చిన వారు ఎలాంటివారో చూడండి. యూదాకు ఆ వర్ణన సరిపోవడం లేదు. మొదటినుంచి కూడా యూదా గుణాలు అతణ్ణి నాశనానికి పాత్రుడుగా చేశాయి. యోహాను 6:70 చూడండి. అతడొక సారి పాపవిముక్తి పొంది రక్షించబడిన తరువాత తప్పిపోయినవాడు కాదు. అందరిలోకీ ఘోరమైన పాపిగా మారిపోయిన నిజ విశ్వాసి కాదు. అతడు ఎప్పుడైనా నిజ విశ్వాసిగా ఉన్నాడనడానికి ఏ ఆధారమూ లేదు. విశ్వాసులమని చెప్పుకునే వారందరినీ, విశ్వాసుల్లాగా కనిపించే వారందర్నీ యేసు కాపాడడు. నిజంగా విశ్వాసులైనవారినే కాపాడుతాడు. “నెరవేరేందుకు”– యోహాను 13:18; కీర్తనల గ్రంథము 41:9; కీర్తనల గ్రంథము 109:4-13; జెకర్యా 11:12-13.

13. ఇప్పుడు నేను నీయొద్దకు వచ్చుచున్నాను; నా సంతోషము వారియందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను.

“ఆనందం”– యోహాను 15:11; లూకా 10:21. యేసు చేసిన ఈ ప్రార్థనను సరిగా అర్థం చేసుకోగలిగితే విశ్వాసుల హృదయాలకు ఇదెంతో ఆనందం కలిగిస్తుంది. పౌలు 2 తిమోతికి 1:12; 2 తిమోతికి 4:18 లో చెప్పిన ఆనందం, నిబ్బరం మనకు కూడా ఉండాలి.

14. వారికి నీ వాక్యమిచ్చి యున్నాను. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును.

యోహాను 15:18-19. యేసుప్రభువు, ఆయన విశ్వాసులు కూడా దేవుని రాజ్యానికీ పరలోకానికీ చెందినవారే గానీ ఈ లోకానికి చెందినవారు కాదు.

15. నీవు లోకములోనుండి వారిని తీసికొనిపొమ్మని నేను ప్రార్థించుటలేదు గాని దుష్టునినుండి వారిని కాపాడు మని ప్రార్థించుచున్నాను.

విశ్వాసులను లోకంలోనే ఉంచాలని ఎందుకు అడుగుతున్నాడు? వ 18; యోహాను 15:27; 2 కోరింథీయులకు 4:17; 1 పేతురు 1:7; 1 పేతురు 2:9 చూడండి. “కాపాడుమని”– వ 11.

16. నేను లోకసంబంధిని కానట్టు వారును లోకసంబంధులు కారు.

17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము; నీ వాక్యమే సత్యము.

యేసుప్రభువు విశ్వాసుల కోసం చేస్తున్న రెండో విన్నపం. “ప్రత్యేకించు” అని తర్జుమా చేసిన గ్రీకు పదానికి చాలా విస్తారమైన అర్థం ఉంది. దీన్ని పవిత్రపరచు అని కూడా అనువదించవచ్చు. సాధారణంగా మంచి ఉద్దేశం కోసం, లేక మత కర్మల కోసం వేరు చేయడం అని దీనికి అర్థం. పాత ఒడంబడిక గ్రంథంలో పవిత్రంగా చేయడం, ప్రత్యేకించడం అని తర్జుమా చేసిన హీబ్రూ పదం లాంటిదే ఇది కూడా (లేవీయకాండము 20:7 నోట్ చూడండి). దీనికి ప్రతిష్ఠించడం, అంకితం చేయడం అనీ, శుద్ధం చేయడం అని కూడా అర్థాలు స్థిరపడ్డాయి. యేసు ఏ భావంతో ఇక్కడ ఈ పదం వాడాడు? ఈ భావాలన్నీ ఆయన మనస్సులో ఉండి ఉండవచ్చు. కానీ బహుశా విశ్వాసుల కోసం చేసిన ఈ ప్రార్థనకు ముఖ్యమైన అర్థం దేవుడు వారిని ప్రతిష్ఠించుకోవాలనీ, తనకోసం, ఈ భూమిపై తన పనికోసం ప్రత్యేకపరచాలనీ కావచ్చు. వ 19లో ఈ అర్థం స్పష్టంగా కనిపిస్తున్నది (యోహాను 10:36 కూడా చూడండి). యేసును శుద్ధీకరించి, పవిత్రపరచవలసిన అవసరత లేదు గాని ఈ లోకంలో దేవుని సంకల్పం ప్రకారం చేసేందుకు తనను తాను ప్రతిష్ఠించు కున్నాడు. ఇదే రీతిలో దేవుడు విశ్వాసులను ప్రత్యేకించి ప్రతిష్ఠించాలని ప్రార్థించాడు. యోహాను 13:10; యోహాను 15:3 లోని మాటలు చూడండి – యేసు తన శిష్యులకోసం ఇలా ప్రార్థించకముందే వారు శుద్ధులు. విశ్వాసులు దేవుని సంకల్పం ప్రకారం చేసేందుకు సంసిద్ధుల్ని చెయ్యాలంటే వారి ఆలోచనల్లో, ఉద్దేశాల్లో శుద్ధీకరణ జరగాలన్నది నిజమే. కనుక ఈ విషయం కూడా వారికి జరగాలని యేసు ఈ ప్రార్థనలో అడిగాడేమో. అయితే దీని ప్రధానమైన భావం ఇదే అనిపిస్తున్నది – తన సంఘం మొత్తాన్ని, అంటే తాను శిరస్సు అయి ఉన్న విశ్వాసుల గుంపంతటినీ (ఎఫెసీయులకు 1:22; ఎఫెసీయులకు 4:15; ఎఫెసీయులకు 5:23; కొలొస్సయులకు 1:18) దేవుని పవిత్ర ప్రజగా (1 పేతురు 2:9) ఆయన ప్రత్యేకించాలి. 17-19 వచనాల్లో ఈ ప్రత్యేకత గురించి ఏడు విషయాలు మనం నేర్చుకోవచ్చు. మొదటిది, అది క్రీస్తు ప్రార్థనకు జవాబుగా దేవుడు చేసే పని. అందువల్ల మరి తిరుగులేకుండా ఆయన దాన్ని జరిగిస్తాడు (యోహాను 11:42). రెండోది, తన పిల్లల్లో కొందరి విషయంలో క్రీస్తు చేసిన ఈ ప్రార్థనను దేవుడు వింటే అందరి విషయంలోనూ ఆయన దాన్ని వింటాడు. కొందరి విషయంలో జవాబిచ్చి వారిని ప్రత్యేకించితే అందరినీ అలా ప్రత్యేకిస్తాడు. మూడోది, విశ్వాసులను ప్రత్యేకించడం క్రీస్తు తనను తాను ప్రత్యేకించుకొన్నదాని ఫలితం (వ 19). పాపాన్ని తీసివేసే అర్పణగా క్రీస్తు తనను ప్రత్యేకించుకున్నాడు (యోహాను 1:29). దాని మూలంగా విశ్వాసులు ప్రత్యేకించబడ్డారు, ఇతరులందరినుంచీ వేరై దేవునికి ప్రత్యేక ప్రజ అయ్యారు – హెబ్రీయులకు 10:10; హెబ్రీయులకు 13:12. పాత ఒడంబడిక ఉదాహరణ కోసం లేవీయకాండము 8:10-15, లేవీయకాండము 8:30 చూడండి. నాలుగోది, విశ్వాసులను ప్రత్యేకించడం యేసు ప్రత్యేకించు కోవడం వంటిదే (వ 19). యేసు తనను ఎప్పుడు ప్రత్యేకించు కొన్నాడు? యోహాను 10:36-38; హెబ్రీయులకు 10:5-7 చూడండి. విశ్వాసులు ఎప్పుడు ప్రత్యేకించబడ్డారు? భూమిపై దేవుని ఆలయంగా మారేందుకు నమ్మకంద్వారా క్రీస్తుతో ఐక్యమైనప్పుడు (ఎఫెసీయులకు 2:21; 1 కోరింథీయులకు 3:16). ఐదోది, విశ్వాసులను ప్రత్యేకించడానికీ, ఈ లోకంలో క్రీస్తుసంఘం పనికీ సంబంధం ఉంది (వ 18; యోహాను 20:21). వారిని లోకంలోనుంచి పిలవడం జరిగింది. (వ 6). వారు లోకానికి చెందినవారు కారు (వ 14). కానీ దేవుడు వారిని ప్రత్యేకించి తిరిగి లోకంలోకి పంపుతాడు. ఆరోది, విశ్వాసులను దేవుడు ప్రత్యేకించడం సత్యంలో (లేక సత్యం వల్ల. ఇక్కడున్న గ్రీకు పదానికి ఈ రెండు భావాలూ ఉన్నాయి). సత్యం అంటే ఏమిటో ఇక్కడ గమనించండి. అది దేవుని వాక్కు. దేవుని వాక్కు ఎక్కడుంటుంది? బైబిల్లో మాత్రమే. దేవుడు విశ్వాసులను ప్రత్యేకించేందుకు వాడే సాధనం సత్యం, వారు ఉంటున్న నివాసం సత్యం. మన అంతరంగంలో క్రీస్తు కోరుతున్న శుద్ధత, పవిత్రత గురించి నోట్స్ కోసం మత్తయి 5:8; రోమీయులకు 6:11-14; రోమీయులకు 8:12-13; 2 కోరింథీయులకు 7:1; ఎఫెసీయులకు 4:22-24; ఎఫెసీయులకు 5:3-7; హెబ్రీయులకు 12:14; 1 పేతురు 1:14-16, 1 పేతురు 1:22; 1 యోహాను 3:3 చూడండి. ఏడోది, క్రీస్తు తన విశ్వాసులకు జరగాలని ప్రార్థించిన ఈ ప్రత్యేకత అత్యంత అవసరం. అలా కాకపోతే క్రీస్తు ఈ విధంగా ప్రార్థించేవాడు కాదు. విశ్వాసులకు ఏది అవసరమని దేవుడు నియమించాడో వాటికోసమే ఆయన ప్రార్థించాడు.

18. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని.

19. వారును సత్యమందు ప్రతిష్ఠచేయ బడునట్లు వారికొరకై నన్ను ప్రతిష్ఠ చేసికొనుచున్నాను.

20. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు, తండ్రీ, నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున,

అన్ని తరాలలో విశ్వాసులందరి కోసమూ యేసుప్రభువు ముందుగానే ప్రార్థించాడు. అప్పట్లో తన శిష్యులకు ఏది ఉండాలని ఆశించాడో ఇప్పుడున్న మనకూ అదే ఉండాలని ఆయన కోరిక.

21. వారును మనయందు ఏకమైయుండవలెనని వారికొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు; వారి వాక్యమువలన నాయందు విశ్వాసముంచువారందరును ఏకమైయుండ వలెనని వారికొరకును ప్రార్థించుచున్నాను.

వ 11. నిజ విశ్వాసులందరి గురించి ఆయన చేసిన మూడో విన్నపం – ఐక్యత. వ 20-23లో దీన్ని గురించి ఈ క్రింది సంగతులను మనం నేర్చుకోవచ్చు. మొదటిది, ఇది క్రీస్తు ప్రార్థనకు జవాబుగా దేవుడు ఇచ్చేది (యోహాను 11:42). ఇది మనుషులు చేకూర్చేది కాదు. క్రైస్తవ సంఘాల నాయకులు కలిసి స్థాపించగలది కాదు. అలా చెయ్యాలని ఆ నాయకులకు క్రీస్తు చెప్పలేదు. రెండోది, ఇది ఒకే కోవకు చెందినవారి ఐక్యత మాత్రమే. వ 6-10లో వర్ణించబడిన నిజ విశ్వాసులకే ఈ ఐక్యత ఉందన్నమాట. ప్రతి దేశంలోనూ క్రైస్తవ సంఘాల్లో ఉండే నామకార్థ క్రైస్తవుల సమూహాలన్నిటినీ కలిపి మనుషులు సమకూర్చే సంస్థాగతమైన ఐక్యత కాదు. నాలుగోది, కొన్ని విషయాల్లో తండ్రి అయిన దేవునికీ కుమారునికీ ఉన్న ఐక్యత లాంటిదే ఈ ఐక్యత (వ 21). అంటే అది పరిపూర్ణమైన ఐక్యం, జీవంలో, స్వభావంలో ఏకత్వం. ఐదోది, ఈ ఐక్యత నిజానికి తండ్రిలోనూ, కుమారునిలోనూ ఉంది. ఇది సంస్థాగతమైన ఐక్యతకు పూర్తిగా భిన్నమైనది. దానికంటే అంతు లేనంత ఉత్తమమైనది. దేవుడు క్రీస్తులో, క్రీస్తు దేవునిలో ఉన్నట్టు విశ్వాసులంతా వీరిద్దరిలో ఉన్నారు (వ 21. 1 థెస్సలొనీకయులకు 1:1; రోమీయులకు 6:5 చూడండి). క్రీస్తు ఇక్కడ ప్రార్థించిన ఐక్యత ఈ ఐక్యత మాత్రమే. ఆరోది, క్రీస్తు తన విశ్వాసుల్లో ఉన్నాడు కాబట్టే ఈ ఐక్యత ఉంటుంది (వ 23). విశ్వాసులు అనంత కాలం ఆయనతో, ఒకరితో ఒకరు ఏకమై ఉంటారు. ఆయన వారిలో లేకపోతే ఆయన ప్రార్థించిన ఐక్యతను సాధించేందుకు మనుషులేమీ చేయలేరు. ఏడోది, ఈ ఐక్యత లోపరహితమైనది, పరిపూర్ణమైనది (వ 22). ఎనిమిదోది, క్రీస్తు విశ్వాసులకు ఇచ్చిన మహిమతో ఇది ముడిపడి ఉంది (వ 22). ఈ మహిమ ఏమిటో ఆయన వివరించలేదు గాని దేవుని పిల్లలుగా భూమిపై ఆయన ప్రతినిధులుగా ఉండగలిగిన ఘనత కావచ్చు. లేదా, మహిమ పొందిన క్రీస్తులో వారు ఉండడం కారణంగా వారికి కలిగిన ఘనత కావచ్చు (వ 1,5. ఎఫెసీయులకు 2:5-6; కొలొస్సయులకు 3:3-4 చూడండి). విశ్వాసులకు తనలో మహిమ కలిగించాలని వారిని క్రీస్తు ఎన్నుకొన్నాడు. ఈ సత్యమే వారు ఒక్కటిగా అయ్యేలా సాధ్యం చేసింది. క్రీస్తు చేసిన ఈ ప్రార్థనకు దేవుని జవాబు కోసం 1 కోరింథీయులకు 12:12-13 చూడండి. (1 కోరింథీయులకు 6:15, 1 కోరింథీయులకు 6:17; రోమీయులకు 12:5; ఎఫెసీయులకు 1:22; ఎఫెసీయులకు 4:15-16; ఎఫెసీయులకు 5:29-32 కూడా చూడండి). పవిత్రాత్మ వచ్చి విశ్వాసులందరినీ క్రీస్తు ఆధ్యాత్మిక దేహంలోకి బాప్తిసమిచ్చి, ఆయనతో వారందరిని ఐక్యత గలవారుగా చేశాడు. ఒక వ్యక్తి క్రీస్తుపై నమ్మకం పెట్టినప్పుడు క్రీస్తు చేసిన ఈ ప్రార్థనకు జవాబు మళ్ళీ వస్తుంది. పవిత్రాత్మ ప్రతి విశ్వాసినీ ఇప్పటికీ క్రీస్తుతో, సజీవ దేవుని నిజ సంఘమనే క్రీస్తుశరీరంతో ఐక్యపరుస్తూ ఉన్నాడు. ఈ ఐక్యతను మనుషులు గుర్తించగలరు గానీ సృష్టించలేరు, మెరుగుపరచలేరు, చెడగొట్టలేరు, నాశనం చేయలేరు. తొమ్మిదోది, ఈ ఐక్యత కొన్ని ఫలితాలను చూపుతుంది (వ 21,23).

22. మనము ఏకమై యున్నలాగున, వారును ఏకమై యుండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని.

23. వారియందు నేనును నా యందు నీవును ఉండుటవలన వారు సంపూర్ణులుగా చేయబడి యేకముగా ఉన్నందున నీవు నన్ను పంపి తివనియు, నీవు నన్ను ప్రేమించినట్టే వారినికూడ ప్రేమించితివనియు, లోకము తెలిసికొనునట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని.

దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ప్రేమించినంతగా విశ్వాసులను కూడా ప్రేమిస్తున్నాడు! రోమీయులకు 5:8; ఎఫెసీయులకు 2:4; 1 యోహాను 3:1, 1 యోహాను 3:16 చూడండి.

24. తండ్రీ, నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతోకూడ ఉండవలె ననియు, నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెననియు కోరుచున్నాను. జగత్తు పునాది వేయబడక మునుపే నీవు నన్ను ప్రేమించితివి.
సామెతలు 8:22-25

విశ్వాసుల పక్షంగా క్రీస్తు చేస్తున్న నాలుగో విన్నపం ఇది. విశ్వాసులంతా భద్రంగా తన సన్నిధి చేరి ఆయన మహిమను చూడగలిగేలా చెయ్యవలసిందని దేవుణ్ణి అడుగుతున్నాడు. క్రీస్తు చేసిన ఇతర ప్రార్థనలన్నీ దేవుడు అంగీకరించినట్టుగానే ఈ ప్రార్థన కూడా అంగీకరించాడు, దాని ప్రకారం చేస్తాడు. క్రీస్తు ప్రార్థనలంటే నెరవేరేందుకు గానీ నెరవేరకపోయేందుకు గానీ అవకాశం ఉన్నవి కాదు. ఇలా జరిగితే బావుణ్ణు అని వెలిబుచ్చిన ఆశలు కావు. అవి దేవుని సంకల్పానికి అనుగుణంగా ఆయన ప్రియ కుమారుడు చేసిన విన్నపాలు, గనుక తప్పక నెరవేరుతాయి. “మహిమ”– ఇది విశ్వాసుల రక్షణ విధానంలో ఆఖరు మెట్టు. క్రీస్తు దీనికోసం ప్రార్థించాడు కాబట్టి అది జరిగిపోయినట్టే దేవుడు లెక్కిస్తున్నాడు. రోమీయులకు 8:29-30; ఎఫెసీయులకు 2:6. ఈ వచనంలో లోక సృష్టికి మునుపే తండ్రి అయిన దేవుడు కుమారుడైన క్రీస్తును ప్రేమించిన విషయం చూడండి. తండ్రి, కుమారుడు వేరువేరు వ్యక్తులనీ, వారి మధ్య శాశ్వత ప్రేమ ఉందనీ మళ్ళీ చూస్తున్నాం.

25. నీతి స్వరూపుడవగు తండ్రీ, లోకము నిన్ను ఎరుగలేదు; నేను నిన్ను ఎరుగుదును; నీవు నన్ను పంపితివని వీరెరిగి యున్నారు.

బైబిలంతటా కనిపించే రెండు సత్యాలను క్రీస్తు ఇక్కడ చెప్తున్నాడు. దేవుడు కేవలం న్యాయవంతుడు, మనుషులకు సాధారణంగా ఆయనను ఎరుగరు (యోహాను 1:10; యోహాను 8:19, యోహాను 8:55; యోహాను 15:21; యోహాను 16:3).

26. నీవు నాయందు ఉంచిన ప్రేమ వారియందు ఉండునట్లును, నేను వారియందు ఉండునట్లును, వారికి నీ నామమును తెలియజేసితిని, ఇంకను తెలియ జేసెదనని చెప్పెను.

క్రీస్తు తన విశ్వాసుల్లో నివసించడానికీ, తండ్రి అయిన దేవుని గురించి ఆయన వారికి వెల్లడించిన దానికీ సంబంధం ఉంది. ఒకటి లేకుండా వేరొకటి లేదు. ఇలా వెల్లడి చేసిన విషయం గురించి వ 6; మత్తయి 11:27 చూడండి. క్రీస్తు పట్ల దేవునికున్న ప్రేమ విశ్వాసుల్లో కూడా ఉన్న సంగతి కూడా గమనించండి (రోమీయులకు 5:5; 2 కోరింథీయులకు 5:14; 1 యోహాను 2:5; 1 యోహాను 4:12, 1 యోహాను 4:16).



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 17 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

తన కొరకు క్రీస్తు ప్రార్థన. (1-5) 
మన ప్రభువు మానవుని పద్ధతిలో ప్రార్థించాడు మరియు తన ప్రజలకు మధ్యవర్తిగా పనిచేశాడు. అయినప్పటికీ, అతను ఘనత మరియు అధికారంతో మాట్లాడాడు, తండ్రితో తన సమానత్వాన్ని ధృవీకరించాడు. విశ్వాసులపై శాశ్వత జీవితాన్ని ప్రసాదించడం క్రీస్తుపై ఆధారపడి ఉంటుంది, వారి హామీ, తండ్రిని మహిమపరచడం మరియు అతని నుండి మహిమను పొందడం. పాపులకు నిత్యజీవితానికి ఈ మార్గం జ్ఞానం యొక్క పరిపూర్ణతతో ముగుస్తుంది, పవిత్రత మరియు ఆనందం యొక్క పూర్తి ఆనందానికి దారి తీస్తుంది. విమోచించబడినవారు తమ పవిత్రతను మరియు ఆనందాన్ని క్రీస్తు మరియు అతని తండ్రి యొక్క ప్రత్యేక మహిమగా కనుగొంటారు. ఈ మహిమ సిలువను సహించడానికి మరియు అవమానాన్ని అసహ్యించుకోవడానికి క్రీస్తును ప్రేరేపించిన ఊహించిన ఆనందం. ఈ మహిమను సాధించడం వలన అతని ఆత్మ యొక్క దుఃఖం వెనుక ఉన్న ఉద్దేశ్యం యొక్క నెరవేర్పును సూచిస్తుంది, అతనిని పూర్తిగా సంతృప్తి పరిచింది. క్రీస్తుతో మనకున్న అనుబంధానికి రుజువుగా దేవుణ్ణి మహిమపరచడం చాలా అవసరమని ఇది మనకు నిర్దేశిస్తుంది, దీని ద్వారా శాశ్వత జీవితం దేవుని నుండి ఉచిత బహుమతిగా ఇవ్వబడుతుంది.

తన శిష్యుల కొరకు అతని ప్రార్థన. (6-10) 
క్రీస్తు తనకు చెందిన వారి కోసం ప్రార్థనలో మధ్యవర్తిత్వం చేస్తాడు. వారు భద్రపరచడానికి గొర్రెల కాపరికి, రోగుల వైద్యునికి వైద్యునికి మరియు పిల్లలకు ఉపదేశము కొరకు బోధకునిగా అతనికి ఇవ్వబడ్డారు. క్రీస్తు తనకు అప్పగించబడిన వారిని రక్షించడానికి మరియు శ్రద్ధ వహించడానికి తన బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తాడు. ఇది క్రీస్తుపై ఆధారపడే వారికి ఆయన గురించిన ప్రతిదీ-అతని ఉనికి, ఆస్తులు, మాటలు, పనులు, ప్రస్తుత చర్యలు మరియు భవిష్యత్తు ప్రయత్నాలు-దేవుని నుండి అని గొప్ప భరోసాను తెస్తుంది.
ఈ ప్రార్థన విశ్వాసుల కోసం ప్రత్యేకంగా అందించబడింది, మొత్తం ప్రపంచం కోసం కాదు. అయితే, ఎవరైనా తమ స్వంత పేరుతో రావడానికి అనర్హులను గుర్తించి, తండ్రిని సంప్రదించాలని కోరుకునేవారు, రక్షకుని ప్రకటనతో నిరుత్సాహపడకూడదు. క్రీస్తు తన ద్వారా దేవుని దగ్గరకు వచ్చేవారిని పూర్తిగా రక్షించగలడు మరియు సిద్ధంగా ఉన్నాడు. ఒక వ్యక్తి యొక్క గంభీరమైన నమ్మకాలు మరియు కోరికలు వారిలో ఇప్పటికే పరివర్తనాత్మక పని జరుగుతోందని ఆశాజనక సంకేతాలుగా పనిచేస్తాయి. ఈ వ్యక్తీకరణలు వారు ఆత్మ యొక్క పవిత్రీకరణ మరియు సత్యంలో విశ్వాసం ద్వారా మోక్షానికి ఎంపిక చేయబడ్డారని సూచిస్తున్నాయి.
తనకు చెందిన వారు దేవుని ఆస్తి అని క్రీస్తు ధృవీకరిస్తూ, ఒక అలంకారిక ప్రశ్నను వేస్తూ: దేవుడు తన స్వంత వాటిని అందించలేదా? ఆయన వారికి భద్రత కల్పించలేదా? ఈ అభ్యర్ధన యొక్క పునాది తండ్రి మరియు కుమారుని మధ్య ఉన్న గాఢమైన ఐక్యతపై ఆధారపడి ఉంటుంది-క్రీస్తుకు చెందినదంతా కూడా తండ్రికి చెందినది, మరియు దీనికి విరుద్ధంగా. ఈ ప్రకటన తండ్రి మరియు కుమారుని యొక్క ఏకత్వాన్ని నొక్కి చెబుతుంది, తండ్రి సేవకు అంకితం చేయని కొడుకు ఎవరినీ తన సొంతం అని చెప్పుకోడు.

అతని ప్రార్థన. (11-26)
11-16
క్రీస్తు ప్రార్థన తన అనుచరుల ప్రాపంచిక సంపద మరియు గొప్పతనం కోసం కాదు, కానీ పాపం నుండి వారి రక్షణ, వారి విధులకు సాధికారత మరియు స్వర్గానికి సురక్షితమైన మార్గం. నిజమైన శ్రేయస్సు, అతని ప్రకారం, ఆత్మ యొక్క శ్రేయస్సులో ఉంది. తండ్రి మరియు కుమారుల మధ్య ఐక్యతకు అద్దం పట్టేలా వారు ఆప్యాయత మరియు శ్రమ రెండింటిలోనూ ఐక్యంగా ఉండేలా వారిని దైవిక శక్తితో కాపాడమని ఆయన తన పవిత్ర తండ్రిని హృదయపూర్వకంగా వేడుకున్నాడు. దేవుని మహిమ మరియు మానవాళి యొక్క ప్రయోజనం కోసం వారు నెరవేర్చవలసిన ముఖ్యమైన పనిని కలిగి ఉన్నందున, హింస నుండి తప్పించుకోవడానికి వారిని ప్రపంచం నుండి తొలగించమని అతని అభ్యర్ధన కాదు. బదులుగా, దుష్టత్వం నుండి వారిని రక్షించమని ప్రార్థించాడు—లోకం యొక్క అవినీతి నుండి, వారి హృదయాలలో పాపం యొక్క దీర్ఘకాలిక ప్రభావాలు మరియు సాతాను యొక్క మోసపూరిత ప్రభావం నుండి వారిని రక్షించడం. అందువలన, వారు శత్రువు యొక్క భూభాగంలో ప్రయాణించినట్లుగా, అతని స్వంత అనుభవం వలె ప్రపంచాన్ని నావిగేట్ చేయగలరు. వారి ఉద్దేశ్యం వారి చుట్టూ ఉన్న వారి నుండి భిన్నంగా ఉంటుంది; వారు ఇతరుల వలె అదే లక్ష్యాలను కొనసాగించడానికి ఇక్కడ లేరు కానీ దేవుణ్ణి మహిమపరచడానికి మరియు వారి తరానికి సేవ చేయడానికి. నిజ క్రైస్తవులలో ఉన్న దేవుని ఆత్మ ప్రపంచపు ఆత్మకు ప్రత్యక్ష వ్యతిరేకతను కలిగి ఉంది.

17-19
తరువాత, క్రీస్తు శిష్యులను చెడు నుండి రక్షించమని మాత్రమే కాకుండా వారు సద్గురువులుగా మారాలని కూడా ప్రార్థించాడు. యేసు, తన ప్రార్థనలో, తనకు చెందిన వారందరికీ పవిత్రత కోసం కోరికను వ్యక్తం చేశాడు. ఆయనను అనుసరించే వారు కూడా ప్రార్థన ద్వారా పవిత్రం చేసే కృపను తప్పక కోరుకుంటారు. ఈ కృపకు వాహిక "నీ సత్యం, నీ మాట సత్యం"గా గుర్తించబడింది. వారి సమర్పణ కోసం, దేవుని సేవ కోసం ప్రత్యేకించబడాలని, దైవిక హస్తం వారికి మార్గనిర్దేశం చేయడంతో వారి పాత్రలలో గుర్తించబడాలని విజ్ఞప్తి. యేసు తనను తాను పూర్తిగా తన మిషన్‌కు అంకితం చేసుకున్నాడు, ముఖ్యంగా శాశ్వతమైన ఆత్మ ద్వారా దేవునికి కళంకం లేకుండా తనను తాను సమర్పించుకోవడంలో.
నిష్కపట క్రైస్తవులందరిలో కనిపించే నిజమైన పవిత్రత క్రీస్తు త్యాగం యొక్క ఫలితం, దీని ద్వారా పవిత్రాత్మ బహుమతిగా పొందబడింది. అతను తన చర్చిని పవిత్రం చేసే ఉద్దేశ్యంతో తనను తాను త్యాగం చేశాడు. ఈ సూత్రాలపై మన అవగాహన మనపై ప్రభావం చూపడంలో మరియు మార్చడంలో విఫలమైతే, అది ఈ భావనల యొక్క దైవిక సత్యంలో లోపాన్ని లేదా సజీవ మరియు చురుకైన విశ్వాసం ద్వారా స్వీకరించబడకపోవడాన్ని సూచిస్తుంది, వాటిని కేవలం మేధో భావనలకు తగ్గించవచ్చు.

20-23
మన ప్రభువు యొక్క ప్రత్యేక ప్రార్థన విశ్వాసులందరి ఐక్యతపై కేంద్రీకృతమై ఒకే తల క్రింద ఒకే శరీరంగా, క్రీస్తుతో మరియు అతనిలోని తండ్రితో వారి కనెక్షన్ ద్వారా ఒకే ఆత్మతో నింపబడి, అంతర్లీనంగా ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా సులభతరం చేయబడింది. చిన్న విషయాలపై వివాదాలలో పాల్గొనడం క్రైస్తవ మతం యొక్క పునాదిపై అనిశ్చితిని మాత్రమే కలిగిస్తుంది. బదులుగా, విశ్వాసులందరిలో ఆలోచన మరియు తీర్పు యొక్క పెరుగుతున్న సామరస్యాన్ని ప్రార్థిస్తూ శాంతి బంధంలో ఆత్మ యొక్క ఐక్యతను కాపాడుకోవడానికి కృషి చేద్దాం. అలా చేయడం ద్వారా, మన విశ్వాసం యొక్క సత్యాన్ని మరియు శ్రేష్ఠతను ప్రపంచానికి ప్రదర్శించడమే కాకుండా దేవునితో మరియు తోటి విశ్వాసులతో లోతైన సహవాసాన్ని కూడా అనుభవిస్తాము.

24-26
తండ్రితో విడదీయరాని ఐక్యతగా, క్రీస్తు తనకు అప్పగించబడిన వారందరి తరపున, ప్రస్తుత విశ్వాసులు మరియు సరైన సమయంలో విశ్వసించే వారి తరపున, వారు స్వర్గంలోకి ప్రవేశించబడతారని నొక్కి చెప్పారు. అక్కడ, విమోచించబడిన వారి మొత్తం సభ అతని మహిమను చూస్తుంది, అతనిని తమ ప్రియమైన స్నేహితుడు మరియు సోదరుడిగా గుర్తిస్తుంది, తద్వారా నిజమైన ఆనందాన్ని కనుగొంటుంది. అతని బోధనలు మరియు అతని ఆత్మ యొక్క మార్గదర్శకత్వం ద్వారా, అతను ఇప్పటికే వెల్లడించాడు మరియు దేవుని పేరు మరియు లక్షణాన్ని ఆవిష్కరిస్తూనే ఉన్నాడు. దేవునితో ఈ ఏకత్వం అంటే క్రీస్తు పట్ల తండ్రికి ఉన్న ప్రేమ విశ్వసించేవారిలో కూడా ఉంటుంది. ఈ భాగస్వామ్య ఆత్మ ద్వారా, వారు దేవుని సంపూర్ణతతో నింపబడతారు, మన ప్రస్తుత స్థితిలో మన అవగాహనకు మించిన ఆశీర్వాదాన్ని అనుభవిస్తారు.




Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |