John - యోహాను సువార్త 5 | View All

1. అటుతరువాత యూదుల పండుగ యొకటి వచ్చెను గనుక యేసు యెరూషలేమునకు వెళ్లెను.

“పండుగ”– లేవీ 23వ అధ్యాయం.

2. యెరూషలేములో గొఱ్ఱెల ద్వారము దగ్గర, హెబ్రీ భాషలో బేతెస్ద అనబడిన యొక కోనేరు కలదు, దానికి అయిదు మంటపములు కలవు.

“బెతెస్థ”– దీని అర్థం “కరుణగృహం” కావచ్చు

3. ఆ యా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదలించుట కలదు. నీరు కదలింపబడిన పిమ్మట, మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధిగలవాడైనను బాగు పడును,

ఇది వ్యాధులు నయం కావడం పరలోకంనుంచే జరుగుతుందనీ, తానింకా వారిని బాగు చేసే దేవుడుగానే ఉన్నాననీ (నిర్గమకాండము 15:26) దేవుడు ఇస్రాయేల్‌ప్రజలకు గుర్తు చేస్తూ ఉన్న విధానం కావచ్చు. ప్రభువు వ్యాధులు నయం చేయడంలో నీటిని ఉపయోగించిన ఇతర సందర్భాల గురించి యోహాను 9:7; 2 రాజులు 5:13-14 చూడండి.

4. గనుక ఆ మంటపములలో రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు ఊచకాలుచేతులు గలవారు, గుంపులుగా పడియుండిరి.

5. అక్కడ ముప్పది యెనిమిది ఏండ్లనుండి వ్యాధిగల యొక మనుష్యుడుండెను.

7వ వచనాన్ని బట్టి ఇతడికి పక్షవాతమో కుంటితనమో ఉన్నట్టుంది.

6. యేసు, వాడు పడియుండుట చూచి, వాడప్పటికి బహుకాలమునుండి ఆ స్థితిలోనున్నాడని యెరిగి స్వస్థపడ గోరుచున్నావా అని వాని నడుగగా

యేసుప్రభువు ఒక అద్భుతం చేయబోతుంటే కొన్నిసార్లు తానే చొరవ తీసుకునేవాడు గానీ అన్ని సార్లూ కాదు. ఇక్కడ ఆయన ఈ ప్రశ్న అడగడంలో ఆ మనిషిలో ఆశాభావాన్ని రేకెత్తించడం ఆయన ఉద్దేశం కావచ్చు. 38 సంవత్సరాలు, అనేక నిరాశల తరువాత ఈ ఆశ బాగా అడుగంటిపోయి ఉండాలి. ఆధ్యాత్మిక విషయాల్లో కూడా క్రీస్తు మనందరినీ ఇదే ప్రశ్న అడుగుతాడు “నీకు నీ పాపాలనుంచి బాగుపడాలని ఇష్టం ఉందా? పాపవిముక్తి పొందాలని కోరిక ఉందా?” దేవుడిచ్చే పాపవిముక్తి గురించిన ఆకలి, దాహం ఉన్నవారే దాన్ని స్వీకరిస్తారు. ఆయన మనకు ఇవ్వదలచుకున్నదాని విషయం మనలో కోరిక కలిగేలా ఆయన చేస్తాడు.

7. ఆ రోగి అయ్యా, నీళ్లు కదలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడును లేడు గనుక నేను వచ్చునంతలో మరియొకడు నాకంటె ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను.

పేదలు, రోగులు, అనాథలు అనేకమందిలో ఉండే నిస్సహాయత ఇక్కడ కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నది. మానవ స్వభావంలోని స్వార్థ బుద్ధిని కూడా ఇది చూపిస్తున్నది. ప్రతివాడూ కోనేట్లోకి అందరికన్నా ముందు తానే దిగాలని తాపత్రయపడుతున్నారు. బైబిలులోని దేవుడైన యేసుప్రభువు నిస్సహాయులకు సహాయుడు, స్నేహితులు లేని వారికి స్నేహితుడు (కీర్తనల గ్రంథము 10:14; కీర్తనల గ్రంథము 54:4; కీర్తనల గ్రంథము 72:12-13; కీర్తనల గ్రంథము 113:5-7; యెషయా 40:29; యెషయా 41:17). ఆయన చేసిన అద్భుతాలు చాలా వరకు పేదల పట్ల, అవసరతలో ఉన్నవారి పట్ల కరుణా క్రియలే.

8. యేసు నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని వానితో చెప్పగా

రోగాలు నయం చేసే ప్రభావం యేసు మాటలో ఉందని గమనించండి. మత్తయి 8:8 చూడండి. నిస్సత్తువగా ఉన్నవాడు తన పడక తీసుకుని నడవడం అసాధ్యం. కానీ యేసు అలా చేయమని అతణ్ణి ఆజ్ఞాపించినప్పుడు అలా చేయగలిగే శక్తిని కూడా ఇచ్చాడు. ఆ ఆజ్ఞకు లోబడడంలోనే ఆ వ్యక్తికి స్వస్థత కలిగింది. మార్కు 3:5; లూకా 17:14 పోల్చి చూడండి.

9. వెంటనే వాడు స్వస్థతనొంది తన పరుపెత్తికొని నడిచెను.

10. ఆ దినము విశ్రాంతిదినము గనుక యూదులు ఇది విశ్రాంతిదినము గదా; నీవు నీ పరుపెత్తికొన తగదే అని స్వస్థత నొందినవానితో చెప్పిరి.
యిర్మియా 17:21

యూదులకు ఇలాంటి సూత్రాలు, నిషేధాలు చాలా ఉన్నాయి. మత్తయి 12:2; మత్తయి 15:2 చూడండి.

11. అందుకు వాడు నన్ను స్వస్థపరచినవాడు నీ పరుపెత్తికొని నడువుమని నాతో చెప్పెననెను.

12. వారు నీ పరుపెత్తికొని నడువుమని నీతో చెప్పినవాడెవడని వానిని అడిగిరి.

13. ఆయన ఎవడో స్వస్థతనొందినవానికి తెలియలేదు; ఆ చోటను గుంపు కూడియుండెను గనుక యేసు తప్పించుకొనిపోయెను.

నమ్మకం లేని ఆ యూదులతో వాదించాలని గానీ తన పేరు అంతటా ప్రచారం కావాలని గానీ యేసుకు ఎంతమాత్రం కోరిక లేదు (యోహాను 4:3).

14. అటుతరువాత యేసు దేవాలయములో వానిని చూచిఇదిగో స్వస్థతనొందితివి; మరి యెక్కువ కీడు నీకు కలుగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా

యేసుప్రభువు తాను ఆరంభించిన పనిని కొనసాగిస్తున్నాడు. పాపవిముక్తి విషయంలోనూ ఇదే చేస్తున్నాడు (ఫిలిప్పీయులకు 1:6). ఆ మనిషి ఆధ్యాత్మిక స్థితిని గురించి శ్రద్ధ కలిగి అతణ్ణి వెదికాడు (లూకా 19:10 పోల్చి చూడండి). అతనితో మాట్లాడిన మాటల్లో ఈ క్రింది భావం ధ్వనిస్తూ ఉంది – అతనికి ఉండిన వ్యాధి అతని పాప ఫలితం; అతడు పాపంలో అలానే కొనసాగే ప్రమాదం ఇప్పటికీ ఉంది; అతనికి (ఎవరికైనా) అతని వ్యాధి నయం కావడం కంటే అతనికి పాపాల నుంచి విముక్తి కలగడం మరింత ప్రాముఖ్యం.

15. వాడు వెళ్లి, తన్ను స్వస్థపరచినవాడు యేసు అని యూదులకు తెలియజెప్పెను.

ఈ మనిషి తెలివితక్కువగా ప్రవర్తించాడు. ఇదంతా యూదులకు చెప్పడం వల్ల యేసుప్రభువుకు ఇబ్బంది వస్తుందని అతడు గ్రహించలేకపోయాడా?

16. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి.

యేసు విశ్రాంతి దినాన్ని మీరడం లేదు. దాని విషయంలో మనుషులు చేసిన నియమాలను మాత్రమే మీరాడు. మత్తయి 12:1-3 నోట్స్ చూడండి. అందరూ విశ్రాంతి దినం గురించి వారు చేసిన సూత్రాల్ని పాటిస్తూ ఉంటే ఎంతమంది వ్యాధులతో, సహాయం లేకుండా, తమ పాపాల్లో సాగిపోతూ ఉన్నా, వారికి ఫర్వాలేదు. వారి గుణశీలాలను మత్తయి 23 అధ్యాయంలో చూడవచ్చు.

17. అయితే యేసునాతండ్రి యిది వరకు పనిచేయుచున్నాడు, నేనును చేయుచున్నానని వారికి ఉత్తరమిచ్చెను.

తండ్రి అయిన దేవుడు విశ్రాంతిదినంలో సహా ఎప్పుడూ చేతులు ముడుచుకుని కూర్చుని ఉండడు. దేవుని కుమారుడైన యేసు విశ్రాంతి దినానికి ప్రభువు (మత్తయి 12:8). మనుషులు చేసిన నియమాలకు ఆయన కట్టుబడడు.

18. ఆయన విశ్రాంతి దినాచారము మీరుట మాత్రమేగాక, దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి, తన్ను దేవునితో సమానునిగా చేసికొనెను గనుక ఇందు నిమిత్తమును యూదులు ఆయనను చంపవలెనని మరి ఎక్కువగా ప్రయత్నము చేసిరి.

దీన్ని గురించి యూదుల ఆలోచన సరైనదే. దేవుడు ఏమై ఉన్నాడో తానే అదై ఉన్నాననీ దేవుని తత్వంలో, ఆయన స్వభావంలో తనకూ భాగం ఉందనీ యేసు అంటున్నాడు. దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో, వేరెవరికీ వర్తించని రీతిలో తన తండ్రి అని చెప్పుకొంటున్నాడు (యోహాను 3:16; మత్తయి 3:17). యోహాను 10:30-37 పోల్చి చూడండి. ఆయన సాక్షాత్తూ దేవుని కుమారుడని వారు నమ్మకపోవడంవల్ల ఆయన దేవదూషణ చేస్తున్నాడన్న నేరం మోపారు. మనుషులు తాము దేవుణ్ణని చెప్పుకోవడం అన్నిటికన్నా ఘోరమైన దేవదూషణ అనీ దీనికి శిక్ష మరణమే అనీ వారికి తెలుసు (మత్తయి 26:65 చూడండి)

19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను తండ్రి యేది చేయుట కుమారుడు చూచునో, అదే కాని తనంతట తాను ఏదియు చేయనేరడు; ఆయన వేటిని చేయునో, వాటినే కుమారుడును ఆలాగే చేయును.

ఈ భాగంలో యేసుప్రభువు తాను దేవుని కుమారుణ్ణి అన్న విషయాన్ని వివరిస్తున్నాడు (వ 19,20), తాను చేయగలిగిన, చేయబోయే కొన్ని విషయాల గురించి మాట్లాడుతున్నాడు (వ 21-30), తాను దేవుని కుమారుణ్ణే అని చెప్పుకునేందుకు కొన్ని ఆధారాలను చూపి, ఆ యూదులు తననెందుకు నమ్మలేదో చెప్తున్నాడు (వ 38-47). ఇక్కడ అతి గంబీరమైన, ప్రాముఖ్యమైన సత్యాలు ఉన్నాయి. “మీతో...చెపుతున్నాను”– యోహాను 1:51 చూడండి. స్వభావం, సంకల్పం, ఉద్దేశాలలో యేసు పరమ తండ్రితో ఎంత ఐక్యంగా ఉన్నాడంటే తనకు తాను సొంతగా ఏ పనులైనా చేయడం అసాధ్యమని నేర్పుతున్నాడు. ఆయన తనంతట తానే ఏమీ చెయ్యలేనిది ఎందుకంటే ఏమీ చెయ్యడు కాబట్టే. ఆయన అలా చేస్తాడన్నది కనీసం ఆలోచనకు కూడా అందరానిది. అయితే తండ్రి అయిన దేవుడు చేసేదంతా ఆయన చేస్తాడు. అంటే అన్ని చోట్లా ఏకకాలంలో ఉండి పని చేసేందుకు కావలసిన ప్రభావం, జ్ఞానం, శక్తిసామర్థ్యాలు తండ్రియైన దేవునిలో లాగే కుమారుడైన యేసులో కూడా ఉన్నాయన్నమాట. అలా లేని పక్షంలో తండ్రి చేసేదంతా చేయడం ఆయనకు సాధ్యం కాదు. యేసుకు దేవుని స్వభావంలో సంపూర్ణ భాగస్వామ్యం ఉందనీ, ఆయన దేవుని అవతారమనీ ఇందువల్ల తెలుస్తున్నది (ఫిలిప్పీయులకు 2:6; లూకా 2:11 నోట్స్‌లో రిఫరెన్సులు చూడండి). ఈ విశ్వంలో ఏది జరిగినా తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ ఐక్యంగానే జరిగిస్తారు. త్రిత్వం గురించి నోట్స్ మత్తయి 3:16-17; మత్తయి 28:19; 2 కోరింథీయులకు 13:14.

20. తండ్రి, కుమారుని ప్రేమించుచు, తాను చేయువాటి నెల్లను ఆయనకు అగపరచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్య పడునట్లు వీటికంటె గొప్ప కార్యములను ఆయనకు అగపరచును.

యోహాను 3:35; యోహాను 17:24. క్రొత్త ఒడంబడిక గ్రంథంలో తరచుగా తండ్రి, కుమారుల మధ్య ఉన్న పరస్పర ప్రేమను చూడవచ్చు. లోకం సృష్టించడానికి ముందే ఆ ప్రేమ ఉంది. అది అనంత కాలం కొనసాగుతూ ఉంటుంది. తండ్రి ఈ విశ్వాన్ని నడిపిస్తూ లోకాన్ని పాలిస్తూ ఉన్నప్పుడు కుమారుని దృష్టి ఎప్పుడూ తండ్రి మీదే ఉంటుంది. తండ్రి కుమారుడి నుంచి దేన్నీ దాచిపెట్టడు. “వీటికంటే గొప్ప పనులు”– అంటే తాను ఇంతవరకు చేసిన అద్భుతాలకంటే గొప్పవి అని అర్థం.

21. తండ్రి మృతులను ఏలాగు లేపి బ్రదికించునో ఆలాగే కుమారుడును తనకిష్టము వచ్చినవారిని బ్రదికించును.

ఇది చనిపోయిన వ్యక్తులను బ్రతికించిన సంగతి గురించి చెప్పిన మాట కావచ్చు (యోహాను 11:43-44; మార్కు 5:35-43; లూకా 7:11-15). అయితే ఆయన ఆధ్యాత్మికంగా శాశ్వత జీవాన్ని ఇచ్చి పాపంలో చనిపోయిన వారిని బ్రతికిస్తాడన్న సంగతి కూడా నిజమే.

22. తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని

మనుషులందరి తీర్పు యేసుప్రభువు చేతిలోనే ఉంటుంది. అలాగని తండ్రికి ఇందులో ఎలాంటి జోక్యమూ లేదని కాదు (అపో. కార్యములు 17:31). అన్నిటిలోనూ వారిద్దరూ కలిసే పని చేస్తారు.

23. తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు; కుమారుని ఘనపరచనివాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచడు.

తీర్పును యేసుప్రభువు చేతుల్లో పెట్టడంలో తండ్రి ఉద్దేశం చూడండి. తండ్రి అయిన దేవుణ్ణి ఘనపరచినట్టుగానే మనుషులు యేసును ఘనపరచాలి. కుమారుడిలో దేవుని తత్వం, స్వభావం పరిపూర్ణంగా లేకపోతే తండ్రి గానీ కుమారుడు గానీ ఎన్నడూ ఇలా కోరరు. దేవునికి మాత్రమే చెందే ఘనతను సృష్టించబడిన ఎవరికీ దేనికీ మనుషులు ఇవ్వరాదు. యేసు ఇక్కడ చెప్తున్నదాన్ని గమనించండి. మనుషులు దేవుని కుమారుణ్ణి ఘనపరచకపోతే వారు దేవుణ్ణి అసలు ఘనపరచడం లేదన్నమాట. అలా చేస్తున్నామని వారు అనుకోవచ్చు, చెప్పుకోవచ్చు గానీ వాస్తవంగా అలా చేయడం లేదు.

24. నా మాట విని నన్ను పంపినవానియందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు; వాడు తీర్పులోనికి రాక మరణములొ నుండి జీవములోనికి దాటియున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

దేవుడు మనుషులకు ఇచ్చిన అతి గొప్ప వాగ్దానాల్లో ఇది ఒకటి. “మీతో ఖచ్చితంగా చెపుతున్నాను” అనే గంబీరమైన వాక్కులు ఈ వాగ్దానానికి ముందు ఉన్నాయి. శాశ్వత జీవం గురించి నోట్స్ యోహాను 3:16, యోహాను 3:36. శాశ్వత జీవం అనేది విశ్వాసికి ఇప్పుడే ఉందని గమనించండి. 3:36లో కుమారునిలో నమ్మకం ఉంచినవారికి ఇది లభిస్తుందని రాసి ఉంది. ఇక్కడైతే ఆయన్ను పంపిన తండ్రిలో నమ్మకం ఉంచినవారికి అది లభిస్తుందని రాసి ఉంది. ఇందులో మళ్లీ తండ్రి, కుమారుల ఐక్యతను చూస్తున్నాం. వారిలో ఒకరిమీద నమ్మకం ఉంచడమంటే మరొకరిమీద ఉంచడమే. మనుషుల పాపాలను బట్టి దేవుడు వారికి శిక్ష విధిస్తాడు. విశ్వాసులందరి పాపాలకూ క్షమాపణ ఉంది. క్రీస్తే వారి శిక్షను భరించాడు. అందువల్లే వారికి శిక్షావిధి లేదు. యోహాను 3:18; రోమీయులకు 8:1 చూడండి. ఇది శాశ్వత భద్రతను సూచిస్తున్నది. అలాగని వారు విశ్వాసులైన తరువాత చేసిన పనులకు తీర్పు ఉండదని కాదు. 2 కోరింథీయులకు 5:10 చూడండి. అయితే ఈ తీర్పు బహుమతులు ఇవ్వడం, ఇవ్వకపోవడం, వీటికి సంబంధించి ఉంటుంది. (1 కోరింథీయులకు 3:10-15). వారి పాపాల కారణంగా మనుషులంతా ఆత్మసంబంధమైన మరణ స్థితిలో ఉన్నారు (ఆదికాండము 2:17; ఎఫెసీయులకు 2:1-3). మనుషులు క్రీస్తులో నమ్మకం ఉంచినప్పుడు దేవుడు వారిని ఆధ్యాత్మికంగా బ్రతికిస్తాడు (యోహాను 1:12-13; ఎఫెసీయులకు 2:5). తక్షణమే వారు మరణ స్థితినుంచి జీవంలోకి మార్పు చెందుతారు. “దాటారు” అనే ఈ మాట భూతకాలంలో ఉండడం గమనించండి. ఈ ఒక్క వచనంలో శాశ్వత జీవాన్ని పొందడం, నిర్దోషుల లెక్కలోకి రావడం, నూతన జన్మ, ఇదంతా నమ్మకం మూలానే అని తెలుస్తున్నది. మనుషుల ముక్తిదాతగా రక్షకుడుగా కుమారుణ్ణి ఈ లోకానికి పంపిన తండ్రిలో నమ్మకం ఉంచడం మూలానే అన్నమాట.

25. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చియున్నది, దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.

ఇక్కడ “చనిపోయినవారు” అంటే బహుశా వ 24లో లాగానే ఆధ్యాత్మిక జీవం లేనివారు అనే అర్థం కావచ్చు, వారి అంతరంగాలలో క్రీస్తు స్వరాన్ని వారు వింటారు. ఆ స్వరాన్ని నమ్మి విధేయులౌతారు (యోహాను 10:3-4, యోహాను 10:16, యోహాను 10:27 పోల్చి చూడండి). అలాంటివారే ఆధ్యాత్మికంగా బ్రతుకుతారు. దేవుని కుమారుడు అనే ఈ పేరును యేసు మూడు సార్లు ఈ శుభవార్తలో తనకు ఉపయోగించుకున్నాడు. – ఇక్కడ యోహాను 10:36; యోహాను 11:4 లో.

26. తండ్రి యేలాగు తనంతట తానే జీవముగలవాడై యున్నాడో ఆలాగే కుమారుడును తనంతట తానే జీవముగలవాడై యుండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను.

“స్వయంగా జీవం గల”– అంటే దేవుడు వేరొకరి సహాయం, ప్రమేయం లేని స్వతంత్రమైన ఉనికి గలవాడని అర్థం. “నేను ఉన్నవాడను” అనేది తన పేరుగా ఆయన చెప్పుకున్నాడు (నిర్గమకాండము 3:14 నోట్ చూడండి). దేవుడు సృష్టించబడిన జీవులన్నిటికీ జీవ ప్రధాత. ఆయన అనాది కాలం నుంచి సజీవుడు. మనుషుల సంగతి పూర్తిగా వేరుగా ఉంది. వారి జీవం వారిలో నుంచి గాక వేరొక మూలాధారంనుంచి వచ్చేది. యేసు కేవలం మానవ స్వభావం ఉన్న మానవ మాత్రుడు కాదు. తండ్రి అయిన దేవునికి ఉన్నట్టుగానే తనలో తనకు స్వయంగా జీవం ఉన్న దేవ కుమారుడు. యేసు ఇతరులకు కూడా జీవాన్నిచ్చే మూలాధారం (వ 12). ఆయన స్వభావ రీత్యా దేవునితో సమానుడు అని చెప్పే వేరొక పద్ధతి ఇది.

27. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పుతీర్చుటకు (తండ్రి) అధికారము అనుగ్రహించెను.

“మానవ పుత్రుడు”– మత్తయి 8:20. యేసు తనను తాను తగ్గించుకొని, మనిషిగా మనుషుల మధ్య బ్రతికి మనిషిని గురించి కూలంకషంగా ఎరిగినవాడు కాబట్టి మనుషులకు న్యాయాధిపతిగా ఉండడానికి ఎంతైనా తగినవాడు. దేవుడే ఆయన్ను మనుషులందరికీ న్యాయాధిపతిగా ఉండడానికి వారికంటే ఎంతో ఉన్నతంగా హెచ్చించాడు (అపో. కార్యములు 17:31).

28. దీనికి ఆశ్చర్యపడకుడి; ఒక కాలము వచ్చుచున్నది; ఆ కాలమున సమాధులలో నున్నవారందరు ఆయన శబ్దము విని

దేవుడు చనిపోయిన మనుషులందరినీ తిరిగి బ్రతికిస్తాడని ఇక్కడ క్రీస్తు చెపుతున్నాడు. వ 28లో “సమాధులలో” అనే మాట గమనించండి. వ 24లో చెప్పినట్టు ఆధ్యాత్మిక జీవం ఇవ్వడం గురించి ఇక్కడ చెప్పడం లేదు. “బయటికి వస్తారు” అంటే అర్థం చనిపోయినవారి ఆత్మలూ తిరిగి వారి మృతదేహాలతో కలిసి, ఆ దేహాలు తిరిగి లేస్తాయన్నమాట. దానియేలు 12:2; అపో. కార్యములు 24:15; 1 కోరింథీయులకు 15:20-22; ప్రకటన గ్రంథం 20:4-6, ప్రకటన గ్రంథం 20:11-15 కూడా చూడండి. రెండు రకాల మనుషులకు రెండు రకాల పునర్జీవితాలు ఉంటాయని యేసు చెప్తున్నాడు. రెండు రకాల మనుషులంటే ఆయనలో నమ్మకం ఉంచినవారు, నమ్మకం ఉంచనివారు అని ఆయన చెప్తాడని మనం అనుకోవచ్చు (యోహాను 3:36 లో లాగా). ఇది నిజమే గానీ మనకొక ముఖ్యమైన సత్యాన్ని నేర్పేందుకు ఆయన దీన్నే వేరే విధంగా చెప్పాడు. అదేమిటంటే ఇతరులకు మేలు చేయడం విశ్వాసి లక్షణం, చెడు చేయడం అవిశ్వాసి లక్షణం. విశ్వాసులు కొత్త జన్మం పొందినవారు (యోహాను 1:13), ఇతరులకు పూర్తిగా భిన్నంగా ఉండే కొత్త సృష్టి (2 కోరింథీయులకు 5:18). ఇందుకు రుజువు ఏమిటంటే వారు మేలు చేస్తుంటారు (మత్తయి 7:17-18; మత్తయి 25:31-46; రోమీయులకు 2:6-11). అవిశ్వాసులు కొన్ని సార్లు తమకు మంచి పనులుగా తోచినవాటిని చేస్తారు. కానీ అలా చెయ్యడంలో వారి ఉద్దేశాలు మంచివి కావు. అంతేగాక అస్తమానం దేవుని కుమారుణ్ణి నిరాకరించి, దేవుని వాక్కుకు లోబడకుండా, తమ పతితమైన భ్రష్ట స్వభావం అనుసరించి నేరమయమైన జీవితం జీవిస్తూనే ఉంటారు. తీర్పుకు గురై శిక్ష అనుభవించడం కోసమే వారిని మళ్ళీ బ్రతికించడం జరుగుతుంది. విశ్వాసులు శాశ్వత జీవాన్ని అనుభవించేందుకు లేస్తారు. మంచివారు, చెడ్డవారు ఒకే సమయంలో మళ్ళీ బ్రతికి లేస్తారని యేసు అనలేదు గానీ రాబోయే కాలంలో ఎప్పుడో ఈ రెండు రకాల మనుషులు తప్పకుండా మళ్ళీ బ్రతికి లేస్తారని మాత్రం చెప్పాడు. ఈ రెండు రకాలు లేచే సమయాలు వేరువేరని ప్రకటన గ్రంథం 20:4-5 సూచిస్తున్నది. 1 థెస్సలొనీకయులకు 4:13-17; 1 కోరింథీయులకు 15:51-53 లో విశ్వాసుల పునర్జీవితం గురించి మాత్రమే ఉంది. దీనికి కారణం బహుశా ఆ సమయానికి విశ్వాసులు మాత్రమే లేస్తారు. ఫిలిప్పీయులకు 3:11 కూడా చూడండి.

29. మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.
దానియేలు 12:2

30. నా అంతట నేనే ఏమియు చేయలేను; నేను విను నట్లుగా తీర్పు తీర్చుచున్నాను. నన్ను పంపిన వాని చిత్తప్రకారమే చేయగోరుదును గాని నా యిష్ట ప్రకారము చేయగోరను గనుక నా తీర్పు న్యాయమైనది.

వ 19-30లో తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి పంపాడనీ, తాను చేసేదాన్ని ఆయన కుమారునికి చూపిస్తాడనీ (వ 20), కుమారునికి అధికారం ఇచ్చాడనీ (వ 22,27) గమనించండి. దేవత్వంలోని ముగ్గురు వ్యక్తులూ (తండ్రి, కుమారుడు, పవిత్రాత్మ) ఒకే స్వభావంలో సమానంగా పాల్గొన్నవారు. ముగ్గురూ దేవుడే. అయితే వారి విధుల్లో ఒక క్రమం ఉంది. కుమారుని కంటే తండ్రికి ఉన్నత స్థానం ఉంది (యోహాను 10:29; యోహాను 14:28). తండ్రి, కుమారుడు కలిసి పవిత్రాత్మను పంపించారు (యోహాను 14:26; యోహాను 15:26; యోహాను 16:7). ఇది బహుశా పవిత్రాత్మ మిగతా ఇద్దరి అధికారానికి లోబడి ఉన్నాడని సూచించవచ్చు. అయితే తత్వంలో, మనసులో, ప్రేమలో, ఉద్దేశాల్లో ఈ ముగ్గురూ కేవలం ఒకే దేవుడు.

31. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినయెడల నా సాక్ష్యము సత్యము కాదు.

యూదుల న్యాయమైన చట్టంలో ఒక మనిషి తన గురించి చెప్పుకునే సాక్ష్యం కోర్టులో అంగీకారం కాదు. ఇతరులెవరన్నా అతణ్ణి గురించి సాక్ష్యం చెప్పాలి. ఒక వ్యక్తిని నేరస్థుడుగా నిర్ణయించాలన్నా, నిర్ధోషిగా తీర్చాలన్నా ఇద్దరు ముగ్గురు సాక్షులు అవసరం (యోహాను 8:17; ద్వితీయోపదేశకాండము 19:15 చూడండి). యేసు తన గురించి చెప్పుకునే విషయాలకు తన సొంత మాటలు తప్ప వేరే ఆధారాలేవీ లేని పక్షంలో యూదులు తనను నమ్మనవసరం లేదంటున్నాడు. తరువాత తన గురించి సాక్ష్యమిచ్చే ఇతరుల విషయం చెపుతున్నాడు. అది వారికోసమే, తన కోసం కాదు (వ 34). తానెవరో ఏమిటో ఆయనకు బాగా తెలుసు. నలుగురు సాక్షులున్నారు. బాప్తిసం ఇచ్చే యోహాను (వ 33), యేసు చేస్తున్న కార్యాలు (వ 36; యోహాను 8:18), తండ్రి అయిన దేవుడు (వ 37), పాత ఒడంబడికలోని వ్రాతలు (వ 39,46).

32. నన్నుగూర్చి సాక్ష్య మిచ్చు వేరొకడు కలడు; ఆయన నన్నుగూర్చి ఇచ్చు సాక్ష్యము సత్యమని యెరుగుదును.

బహుశా తండ్రి అయిన దేవుడు అని యేసు ఉద్దేశం కావచ్చు (వ 37). కానీ బాప్తిసమిచ్చే యోహాను గురించి ఆయనిలా అన్నాడని కొందరి అభిప్రాయం (వ 33).

33. మీరు యోహాను నొద్దకు (కొందరిని) పంపితిరి; అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను.

యోహాను 1:19-34 చూడండి.

34. నేను మనుష్యులవలన సాక్ష్యమంగీకరింపను గాని మీరు రక్షింప బడవలెనని యీ మాటలు చెప్పుచున్నాను.

35. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమైయుండెను, మీరతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందిచుటకు ఇష్ట పడితిరి.

“వెలుగు”– మత్తయి 5:14-16 పోల్చి చూడండి. యోహాను చేసినది ఇదే.

36. అయితే యోహాను సాక్ష్యముకంటె నా కెక్కువైన సాక్ష్యము కలదు; అదేమనిన, నేను నెర వేర్చుటకై తండ్రి యే క్రియలను నా కిచ్చియున్నాడో, నేను చేయుచున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి యున్నాడని నన్నుగూర్చి సాక్ష్యమిచ్చుచున్నవి.

మనుషులను వారు చేసే పనులను బట్టి తెలుసుకోవచ్చు (మత్తయి 7:15-20). యేసు చేసిన పనులు ఆయన ఎవరో, ఎలాంటివాడో సాక్ష్యంగా ఉన్నాయి (యోహాను 2:11; యోహాను 3:2; యోహాను 10:25, యోహాను 10:37-38; మత్తయి 8:1; మత్తయి 11:4-6).

37. మరియు నన్ను పంపిన తండ్రియే నన్నుగూర్చి సాక్ష్య మిచ్చుచున్నాడు; మీరు ఏ కాలమందైనను ఆయన స్వరము వినలేదు; ఆయన స్వరూపము చూడలేదు.

యోహాను 8:18; 1 యోహాను 5:9. తండ్రి పాత ఒడంబడికలోని భవిష్యద్వాక్కుల ద్వారా కుమారుని గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అంతేగాక కుమారుడు జన్మించకముందే దేవదూత ద్వారా (మత్తయి 1:20-23; లూకా 1:26-35), ఆయన బాప్తిసం, కొండపై ఆయన రూపం మార్పు చెందిన సందర్భాల్లో కంఠ ధ్వనిద్వారా (మత్తయి 3:17; మత్తయి 17:5), ఆయన జీవిత కాలమంతా ఆయన చేసిన అద్భుత కార్యాల్లో ఆయనతో కలిసి పని చేయడం ద్వారా (యోహాను 14:10; అపో. కార్యములు 10:38) తండ్రి ఆయనకు సాక్ష్యం పలుకుతున్నాడు.

38. ఆయన ఎవరిని పంపెనో ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచియుండలేదు.

వారికి దేవుని వాక్కు (పాత ఒడంబడిక గ్రంథం) అందుబాటులో ఉంది. దాన్ని శ్రద్ధగా పఠించారు (వ 39) గనుక అది వారి మనసుల్లో ఉంది. కానీ అది వారి అంతరంగాల్లో లేదు. అది వారిలో సజీవంగా ఉండి వారిని జీవింపజేయలేదు (కీర్తనల గ్రంథము 119:11 పోల్చి చూడండి).

39. లేఖన ములయందు మీకు నిత్యజీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్నుగూర్చి సాక్ష్యమిచ్చు చున్నవి.

లేఖనాలు (లేక లేఖనం) క్రొత్త ఒడంబడిక గ్రంథంలో తరచుగా (53 సార్లు) కనిపించే మాట. దీనికి అర్థం “రాసివున్నవి”. పాత ఒడంబడిక పుస్తకాలను ఉద్దేశించి లేఖనాలు అన్నారు (కానీ 2 పేతురు 3:16 చూడండి). పాత ఒడంబడిక గ్రంథం నిండా యేసుప్రభువును గురించిన భవిష్యత్ వాక్కులూ సాదృశ్యాలూ సూచనలూ చిహ్నాలూ సంకేతాలూ ఉన్నాయి. వ 46; లూకా 24:27, లూకా 24:45-46 చూడండి.

40. అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నాయొద్దకు రానొల్లరు.

తమకు శాశ్వత జీవం ఉందని వారనుకున్నారు గాని అది వారిలో లేదు. అలాంటి ఆధ్యాత్మిక జీవాన్ని వారికివ్వగల ఒకే ఒక వ్యక్తి దగ్గరికి నమ్మకంతో రావడానికి వారికి ఇష్టం లేదు (వ 21; యోహాను 3:36). ఈ నాటికీ అనేకమంది ఇంతే.

41. నేను మనుష్యులవలన మహిమ పొందువాడనుకాను.

అనేక మంది మత నాయకుల్లాగా కాక (వ 44), మనుషులు ఇవ్వగల ఘనత, గొప్పతనం అంటే ఆయనకు ఎంతమాత్రం లెక్కలేదు. మనుషులు తనను పొగడాలని వారికి ఇష్టమైన విధంగా ప్రవర్తించేందుకు ఆయనెప్పుడూ ప్రయత్నించలేదు. ఆయన గురి అంతా యోహాను 8:29 లో చూడవచ్చు. ఇందులోనూ, మిగతా అన్ని విషయాల్లోనూ మనకు ఆదర్శం ఆయనే.

42. నేను మిమ్మును ఎరుగుదును; దేవుని ప్రేమ మీలో లేదు.

మనిషిలో ఏముందో యేసుకు తెలుసు – యోహాను 2:24-25. వారికి దేవుడంటే ప్రేమ ఉంటే వారు క్రీస్తును కూడా ప్రేమించేవారేనని ఆయనకు తెలుసు (యోహాను 8:42). తనను వారు ద్వేషించడం దేవునిపట్ల వారికున్న ద్వేషాన్ని బట్టబయలు చేసింది (యోహాను 15:24). దేవుణ్ణి తాము ప్రేమిస్తున్నామని వారు చెప్పుకుంటూ ఉండేవారు గానీ నిజానికి ఆయనంటే వారికున్నది ద్వేషమే. యిర్మియా 17:9 చూడండి.

43. నేను నా తండ్రి నామమున వచ్చియున్నాను, మీరు నన్ను అంగీకరింపరు, మరి యొకడు తన నామమున వచ్చినయెడల వానిని అంగీ కరింతురు,

తండ్రి పేర రావడం అంటే తండ్రి అయిన దేవుని అధికారంతో వచ్చాడనీ ఆయనకు సంపూర్ణంగా ప్రాతినిధ్యం వహించాడనీ అర్థం. తన పేరునే రావడమంటే తన సొంత అధికారంతో తన తరుఫున తానే రావడం (అలాంటివారు క్రీస్తు పక్షంగా వచ్చామని చెప్పుకోవచ్చు). ఇలా చేసేవారు చాలామంది ఉన్నారు. మత్తయి 24:24 చూడండి. ఇలాంటి వారందరికీ ప్రధాని క్రీస్తువిరోధి (2 థెస్సలొనీకయులకు 2:3-4).

44. అద్వితీయ దేవునివలన వచ్చు మెప్పునుకోరక యొకనివలన ఒకడు మెప్పుపొందుచున్న మీరు ఏలాగు నమ్మగలరు? నేను తండ్రియొద్ద మీమీద నేరము మోపుదునని తలంచకుడి;

ఇక్కడ వర్ణించబడిన వారి గుణాలు వారు క్రీస్తులో నమ్మకం ఉంచడం అసాధ్యం చేస్తాయి. వారి జీవితానికి, ఉనికికి వారే కేంద్రాలు. మనుషులు తమను పొగడాలన్నదే వారి ఆశ. వారి హృదయాల్లో దేవునికి ఇసుమంతైనా స్థలం లేదు. గలతియులకు 1:10 లో దీనికి వ్యతిరేకమైన పరిస్థితి చూడండి.

45. మీరాశ్రయించుచున్న మోషే మీమీద నేరము మోపును.
ద్వితీయోపదేశకాండము 31:26-27

యేసు నేరాలు మోపడానికి గానీ తీర్పు తీర్చడానికి గానీ రాలేదు (యోహాను 3:17). వారిపై నేరాలు మోపేవాడు మోషే. అంటే దేవుడు మోషేచేత రాయించిన లేఖనాలు (బైబిలులోని మొదటి ఐదు పుస్తకాలు) వారిని నేరస్థులుగా నిర్ణయిస్తున్నాయన్నమాట. అతడు రాసినవాటిని వారు నిజంగా నమ్మలేదు కాబట్టి ఇలా జరుగుతుంది (నమ్ముకుంటున్నామని వారు అనుకునేవారు గాని నిజంగా నమ్మలేదు). అతడు రాసిపెట్టిన సత్యాన్ని వారు ఆచరణలో పెట్టలేదు.

46. అతడు నన్నుగూర్చి వ్రాసెను గనుక మీరు మోషేను నమ్మినట్టయిన నన్నును నమ్ముదురు.
ద్వితీయోపదేశకాండము 18:15

యోహాను 1:17; యోహాను 7:19; లూకా 24:27, లూకా 24:45-46 పోల్చి చూడండి. మోషే పుస్తకాలనబడిన వాటిని రాసినది మోషేనేననీ, అతడు క్రీస్తును గురించి రాశాడనీ (వ 39) తేటతెల్లం చేస్తున్న మాట ఇది. నిర్గమకాండము 17:14; నిర్గమకాండము 24:4; నిర్గమకాండము 34:27; సంఖ్యాకాండము 33:2; ద్వితీయోపదేశకాండము 31:9 చూడండి.

47. మీరతని లేఖనములను నమ్మనియెడల నా మాటలు ఏలాగు నమ్ముదురనెను.

ఇది వారు గానీ వేరెవరైనా గానీ జవాబు చెప్పలేని ప్రశ్న. పై వచనాలను బట్టి తాను దేవుని కుమారుణ్ణని క్రీస్తు చెప్పుకొన్న మాటలకు అమోఘమైన, ఆశ్చర్యకరమైన గొప్ప సాక్ష్యాధారాలూ రుజువులూ ఉన్నాయని మనం నేర్చుకోవాలి. మానవజాతి చరిత్ర అంతటిలో మరెవరికీ ఇలాంటి సాక్ష్యాధారాలూ రుజువులూ లేవు. ఈ సాక్ష్యం మార్గదర్శిగా మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నదో అక్కడికి అందరం పోదాం. ఆ విధంగా యేసుప్రభువును మన ప్రభువుగా రక్షకుడుగా నమ్ముకుందాం. అలా చెయ్యకపోతే ఆ గొప్ప నష్టం మనదే.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
John - యోహాను సువార్త 5 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

బెథెస్డా కొలను వద్ద నివారణ. (1-9) 
స్వతహాగా, మనమందరం ఆధ్యాత్మికంగా శక్తిహీనులము, చూపులేనివారము, వికలాంగులము మరియు వాడిపోయినవారము. అయినప్పటికీ, మనం దానిపై శ్రద్ధ వహిస్తే సమగ్ర నివారణ అందుబాటులో ఉంది. ఒక దేవదూత దిగి నీటిని కదిలించాడు, మరియు అనారోగ్యంతో సంబంధం లేకుండా, నీరు దానిని నయం చేయగలదు. అయితే, మొదట అడుగుపెట్టిన వ్యక్తి మాత్రమే ప్రయోజనం పొందాడు. మళ్లీ రాని అవకాశాలను చేజిక్కించుకోవడం యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. ఆ వ్యక్తి ముప్పై ఎనిమిదేళ్లుగా అశక్తుడు. చాలా సంవత్సరాలలో కొన్ని రోజుల అనారోగ్యాన్ని అనుభవించిన మనం, మనకంటే దురదృష్టవంతులైన ఇతరులకు క్షేమ దినం తెలియనప్పుడు, అలసిపోయిన ఒక్క రాత్రి గురించి ఫిర్యాదు చేయాలా?
క్రీస్తు ప్రత్యేకంగా ఈ వ్యక్తిని సమూహం నుండి ఎన్నుకున్నాడు. దీర్ఘకాల బాధను సహించే వారు తమ బాధల వ్యవధిని దేవుడు ట్రాక్ చేస్తున్నాడని తెలుసుకోవడం ద్వారా ఓదార్పు పొందవచ్చు. మనిషి తన చుట్టూ ఉన్నవారి పట్ల అసహ్యకరమైన ఆలోచనలను కలిగి ఉండకుండా వ్యక్తపరుస్తాడని గమనించండి. మనం కృతజ్ఞతను పెంపొందించుకునేటప్పుడు, మనం సహనాన్ని కూడా అలవర్చుకోవాలి. శోధించబడకుండా లేదా ఎదురుచూడకుండా, మన ప్రభువైన యేసు అతనిని ఒక సాధారణ ఆజ్ఞతో స్వస్థపరుస్తాడు: "లేచి నడవండి." దేవుని ఆదేశం, "తిరిగి జీవించండి," లేదా "మిమ్మల్ని కొత్త హృదయంగా మార్చుకోండి", దేవుని దయ, ఆయన విలక్షణమైన దయ లేకుండా మనలో స్వాభావికమైన శక్తిని ఊహించదు. అదేవిధంగా, ఈ ఆదేశం బలహీనమైన మనిషిలో స్వాభావికమైన సామర్థ్యాన్ని సూచించదు; ఇది క్రీస్తు యొక్క శక్తి, మరియు అతను అన్ని కీర్తికి అర్హుడు.
ఒకప్పుడు వికలాంగుడైన వ్యక్తి, అకస్మాత్తుగా తనను తాను తేలికగా, దృఢంగా మరియు సమర్థుడిగా గుర్తించడం యొక్క ఆనందకరమైన ఆశ్చర్యాన్ని ఊహించండి. ఆధ్యాత్మిక స్వస్థతకు నిదర్శనం మనం లేచి నడవగల సామర్థ్యం. క్రీస్తు మన ఆధ్యాత్మిక వ్యాధులను నయం చేసినట్లయితే, ఆయన నిర్దేశించిన చోటికి మనం ఇష్టపూర్వకంగా వెళ్దాం మరియు ఆయన అప్పగించినదంతా స్వీకరించి, ఆయన ముందు నడుద్దాం.

యూదుల అసంతృప్తి. (10-16) 
పాపం యొక్క పరిణామాల నుండి విముక్తి పొందిన వారు భయం మరియు నిగ్రహాన్ని ఎత్తివేసినట్లయితే, దైవిక దయ మూలాన్ని గట్టిగా మూసివేస్తే తప్ప, పాపానికి తిరిగి వచ్చే ప్రమాదం ఉంది. విశ్వాసులు విమోచించబడిన బాధలు, దాని పర్యవసానాల బాధను అనుభవించి, పాపం నుండి దూరంగా ఉండాలనే కఠినమైన ఉపదేశంగా ఉపయోగపడుతుంది. ప్రతి ప్రొవిడెన్స్ సందేశాన్ని ప్రతిధ్వనిస్తుంది: "వెళ్ళు, ఇక పాపం చేయవద్దు." అనారోగ్యంగా ఉన్నప్పుడు గొప్ప వాగ్దానాలు చేయడం, కొత్తగా కోలుకున్నప్పుడు కొంత భాగాన్ని మాత్రమే చేయడం మరియు చివరికి అన్నింటినీ మరచిపోవడం అనే సాధారణ ధోరణిని గుర్తించి, క్రీస్తు ఈ హెచ్చరికను జారీ చేయడం అవసరమని కనుగొన్నాడు.
క్రీస్తు తక్షణ బాధల గురించి మాత్రమే కాకుండా రాబోయే క్రోధం గురించి కూడా మాట్లాడాడు, ఇది కొంతమంది దుర్మార్గులు తమ అక్రమ భోగాల ఫలితంగా అనుభవించే సుదీర్ఘమైన నొప్పి-గంటలు, వారాలు లేదా సంవత్సరాల కంటే కూడా అపరిమితంగా ఉంటుంది. అటువంటి తాత్కాలిక బాధలు తీవ్రంగా ఉంటే, దుర్మార్గులకు ఎదురు చూస్తున్న శాశ్వతమైన శిక్ష యొక్క భయానకతను మాత్రమే గ్రహించవచ్చు.

క్రీస్తు యూదులను గద్దించాడు. (17-23) 
దైవిక శక్తి యొక్క అద్భుత ప్రదర్శన యేసును దేవుని కుమారునిగా ధృవీకరించింది మరియు అతను దైవిక ఉద్దేశ్యంతో అనుసంధానించబడిన పద్ధతిలో తన తండ్రికి సహకరించాడని మరియు అతనిని పోలి ఉన్నాడని అతను స్పష్టంగా పేర్కొన్నాడు. పురాతన కాలం నుండి వచ్చిన ఈ విరోధులు అతని సందేశాన్ని గ్రహించారు మరియు మరింత తీవ్రంగా పెరిగారు, అతను సబ్బాత్‌ను ఉల్లంఘించడమే కాకుండా దేవుణ్ణి తన స్వంత తండ్రిగా చెప్పుకోవడానికి మరియు తనను తాను దేవునితో సమానంగా ఉంచుకున్నందుకు దైవదూషణకు కూడా ఆరోపించాడు. ప్రస్తుతం మరియు అంతిమ తీర్పులో, అన్ని అధికారాలు కుమారునికి అప్పగించబడ్డాయి, తద్వారా ప్రజలందరూ తండ్రిని గౌరవించినట్లే కుమారునికి కూడా గౌరవం చూపవచ్చు. కుమారుడిని ఈ విధంగా గౌరవించడంలో విఫలమైన ఎవరైనా, వారి ఆలోచనలు లేదా వాదనలతో సంబంధం లేకుండా, అతనిని పంపిన తండ్రిని నిజంగా గౌరవించరు.

క్రీస్తు ప్రసంగం. (24-47)

24-29
మన ప్రభువు మెస్సీయగా తన అధికారాన్ని మరియు గుర్తింపును ప్రకటించాడు. మరణించిన వ్యక్తి అతని స్వరాన్ని వినడానికి, అతనిని దేవుని కుమారునిగా గుర్తించి, కొత్త జీవితాన్ని అనుభవించడానికి సమయం ఆసన్నమైంది. ప్రారంభంలో, మన ప్రభువు ఆత్మీయంగా చనిపోయిన వారిని పునరుజ్జీవింపజేసి, ఆత్మ యొక్క శక్తి ద్వారా వారిని కొత్త జీవితానికి తీసుకురావడం గురించి మాట్లాడుతున్నాడు. తదనంతరం, భౌతికంగా మరణించిన వారి సమాధులలో పునరుత్థానం చేయగల తన సామర్థ్యాన్ని అతను సూచించాడు. సర్వ మానవాళికి న్యాయమూర్తి పాత్రను సర్వజ్ఞుడైన జ్ఞానం మరియు సర్వశక్తిమంతుడైన వ్యక్తి మాత్రమే ఊహించగలడు. మనం ఆయన సాక్ష్యాన్ని విశ్వసిద్దాం, మన విశ్వాసాన్ని మరియు నిరీక్షణను దేవునితో సమలేఖనం చేద్దాం, తద్వారా ఖండించడాన్ని నివారించండి. ఆయన మాటలు ఆధ్యాత్మికంగా నిర్జీవమైన వారి హృదయాల్లోకి చొచ్చుకుపోయి, పశ్చాత్తాపపడే చర్యలను చేపట్టడానికి మరియు రాబోయే తీర్పు దినానికి సిద్ధం కావడానికి వారిని ప్రేరేపించేలా చేస్తాయి.

30-38
మన ప్రభువు తండ్రి మరియు కుమారుని మధ్య ఉన్న ఒప్పందం యొక్క సమగ్ర స్వభావాన్ని పునరుద్ఘాటించాడు, దేవుని కుమారునిగా తన గుర్తింపును నొక్కిచెప్పాడు. అతను జాన్ యొక్క సాక్ష్యాన్ని కూడా అధిగమించే సాక్ష్యాలను సమర్పించాడు-అతని చర్యలు అతని మాటల సత్యానికి సాక్ష్యం. దైవిక పదం యొక్క బలవంతపు స్వభావం ఉన్నప్పటికీ, పురాతన కాలంలో వాగ్దానం చేసినట్లుగా, తండ్రి పంపిన వ్యక్తిని విశ్వసించడానికి వారు నిరాకరించడం వల్ల వారి హృదయాలలో నివసించడానికి ఇది చోటు లేదు. పరిశుద్ధాత్మ శక్తితో కూడిన దేవుని స్వరం పాపులను మార్చడంలో ప్రభావవంతంగా కొనసాగుతుంది, ఇది ప్రియమైన కుమారుడని, తండ్రిని సంతోషపరుస్తుంది. అయితే, హృదయాలు గర్వం, ఆశయం మరియు ప్రపంచం పట్ల ప్రేమతో నిండినప్పుడు, దేవుని వాక్యం వాటిలో వేళ్ళూనుకోవడానికి స్థలం లేదు.

39-44
యూదులు తమ లేఖనాల ద్వారా నిత్యజీవం తమకు తెలియజేయబడిందని విశ్వసించారు, తమ చేతుల్లో దేవుని వాక్యం ఉన్నందున వారు దానిని కలిగి ఉన్నారని పట్టుకున్నారు. ఆ లేఖనాలను మరింత శ్రద్ధగా, శ్రద్ధగా పరిశీలించమని యేసు వారిని ప్రోత్సహించాడు. లేఖనాలను శోధించడంలో వారి ప్రయత్నాన్ని ఆయన అంగీకరించాడు, అయితే వారి స్వంత కీర్తిని వెదకడమే వారి ప్రేరణ అని సూచించాడు. వ్యక్తులు లేఖనాల లేఖను అధ్యయనం చేయడంలో నిశితంగా ఉండటం సాధ్యమవుతుంది, అయితే దాని పరివర్తన శక్తిని పట్టించుకోదు. "లేఖనాలను శోధించండి" అనే ఆదేశం వారు లేఖనాలను అంగీకరించినట్లుగా అంగీకరించడం మరియు లేఖనాలను న్యాయమూర్తిగా ఉండనివ్వమని వారికి విజ్ఞప్తి. ఈ సలహా క్రైస్తవులందరికీ విస్తరిస్తుంది, కేవలం లేఖనాలను చదవడం మరియు వినడం మాత్రమే కాకుండా వాటిని క్షుణ్ణంగా పరిశీలించి, అధ్యయనం చేయాలని సూచిస్తూ శ్రద్ధతో వాటిని పరిశోధించమని వారిని ప్రోత్సహిస్తుంది.
పరలోక ప్రయోజనాల కోసం అన్వేషణ నొక్కిచెప్పబడింది, ఎందుకంటే లేఖనాలు శాశ్వత జీవితాన్ని పొందే సాధనంగా పరిగణించబడతాయి. క్రీస్తు కోసం లేఖనాలను శోధించడం, ఈ అంతిమ ముగింపుకు దారితీసే కొత్త మరియు సజీవ మార్గం కూడా హైలైట్ చేయబడింది. ఈ సాక్ష్యంతో పాటు, క్రీస్తు వారి అవిశ్వాసాన్ని, అతని పట్ల మరియు అతని బోధనల పట్ల నిర్లక్ష్యంగా మరియు దేవుని పట్ల వారి ప్రేమ లేకపోవడాన్ని ఖండించాడు. ఈ మందలింపులు ఉన్నప్పటికీ, అవసరమైన వారికి యేసుక్రీస్తుతో జీవితం ఉందని అతను హామీ ఇచ్చాడు. మతాన్ని ప్రకటించే అనేకులు క్రీస్తును నిర్లక్ష్యం చేయడం మరియు ఆయన ఆజ్ఞలను ధిక్కరించడం ద్వారా దేవుని ప్రేమ లోపించినట్లు బహిర్గతమవుతుంది. హృదయంలో సజీవమైన, చురుకైన సూత్రమైన ప్రేమను దేవుడు అంగీకరిస్తాడు. తమను తాము ఎక్కువగా అంచనా వేసుకోవడం వల్ల క్రీస్తును తక్కువగా అంచనా వేయడం కూడా ఈ నిందలో ఉంటుంది. మనుష్యుల ప్రశంసలు మరియు చప్పట్లను ఆరాధించే వారు, ముఖ్యంగా క్రీస్తు మరియు అతని అనుచరులు ఆశ్చర్యానికి గురిచేసే వస్తువులుగా ఉన్నప్పుడు నమ్మడం సవాలుగా ఉంది. ఆకట్టుకునే బాహ్య ప్రదర్శన చేయాలనే ప్రధాన ఆశయం ఉన్నవారికి నమ్మకం అంతుచిక్కనిది.

45-47
అనేక మంది వ్యక్తులు ఆ సిద్ధాంతాల సారాంశాన్ని లేదా వారు అనుబంధించబడిన వ్యక్తుల ఉద్దేశాలను నిజంగా గ్రహించకుండా కొన్ని సిద్ధాంతాలు లేదా వర్గాలపై తమ నమ్మకాన్ని ఉంచుతారు. వారి అవగాహన మోషే బోధలను గ్రహించడంలో విఫలమైన యూదుల మాదిరిగానే ఉంది. నిత్యజీవాన్ని కోరుతూ, లేఖనాలను శ్రద్ధగా అన్వేషించడం మరియు ప్రతిబింబించడం మనకు అత్యవసరం. క్రీస్తు ఈ లేఖనాల యొక్క ప్రధాన ఇతివృత్తంగా ఎలా ఉన్నాడో పరిశీలించడం ద్వారా, మన ప్రార్థనలు మరియు భక్తి ద్వారా ఆయన అందించే జీవితాన్ని వెతుకుతూ మనం ప్రతిరోజూ ఆయన వైపు తిరగవచ్చు.


Shortcut Links
యోహాను - John : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |