తనపట్ల విధేయులుగా ఉంటే దేవుడు తన ప్రజలను అనేక విధాలుగా దీవిస్తానని మాట ఇచ్చాడు. ఈ దీవెనలలో కొన్ని ఇహలోక సంబంధమైనవే. పాత ఒడంబడిక కాలంలో ధనధాన్యాలు ఉండడం దైవాశీర్వాదాలకు గుర్తు అని ప్రజలు అనుకున్నారు. తరచుగా అది నిజంగా గుర్తే గాని ఎల్లప్పుడూ కాదు. క్రొత్త ఒడంబడికలో దేవుడిస్తానన్న దీవెనలు చాలామట్టుకు ఆధ్యాత్మికం, శాశ్వతం (ఎఫెసీయులకు 1:3). మత్తయి 5:3-12 లూకా 6:20-26 లో యేసుప్రభువు చెప్పిన మాటలతో ద్వితీయోపదేశకాండంలోని ఈ వాక్యభాగాన్ని పోల్చిచూడండి. ఆదికాండము 24:35 నోట్ చూడండి. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు ఇహలోకానికి సంబంధించిన దీవెనలకంటే ఎంతో శ్రేష్ఠమైనవి, ప్రధానమైనవి. యేసుప్రభువు చెప్పాడు కదా “దరిద్రులారా, మీరు ధన్యులు. దేవుని రాజ్యం మీది” (లూకా 6:20). ఈ కాలంలో జీవిస్తున్న విశ్వాసులు పాత ఒడంబడిక సంప్రదాయాన్ని అనుసరించి సంపదలు ఉండడమే దైవాశీర్వాదాలకు గుర్తు అనుకోవడం ఆత్మవంచనే. ధనికులు చాలామంది (వీరిలో క్రైస్తవులనబడినవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు) వారి అపనమ్మకం, అవిధేయతల మూలంగా దేవుని కోపం క్రింద ఉన్నారు (యోహాను 3:36 యాకోబు 5:1-6). పేదలనేకమందికీ క్రీస్తులో శాశ్వత భాగ్యాలు ఉన్నాయి. ఈజిప్ట్ బానిసత్వంలో, ఎడారి ప్రయాణంలో, కనానులో ఇస్రాయేల్వారి విషయాలు నేడు మన ఎదుట ఉన్న ఆధ్యాత్మిక వాస్తవాలకు సూచనలుగా ఉన్నాయని గుర్తుంచుకోండి.