Revelation - ప్రకటన గ్రంథము 20 | View All

1. మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.

ఈ సంఘటనకు ముందు వేశ్యను, మృగాన్ని, కపట ప్రవక్తను శిక్షించడం జరిగింది. అయితే క్రీస్తు దివ్య పరిపాలన కోసం భూలోకం పూర్తిగా సిద్ధమయ్యేలా ఆయన మరో వ్యక్తిని తొలగించాలి. ఈ వచనాల్లో ఇది ఉంది. ప్రకటన గ్రంథం 20:1 “అగాధం”– ప్రకటన గ్రంథం 9:1 నోట్.

2. అతడు ఆదిసర్పమును, అనగా అపవాదియు సాతానును అను ఆ ఘటసర్పమును పట్టుకొని వెయ్యి సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి,
ఆదికాండము 3:1, జెకర్యా 3:1-2

“సర్పాన్ని”– ప్రకటన గ్రంథం 12:3, ప్రకటన గ్రంథం 12:9. “సైతాను”– 1 దినవృత్తాంతములు 21:1; మత్తయి 4:1-10; యోహాను 8:44 నోట్స్. “వెయ్యేళ్ళు”– వ 4,6. ఇవి అక్షరాలా వెయ్యి సంవత్సరాలు కాదని బైబిలు విద్వాంసుల్లో కొందరు చెప్పారు. అయితే ఇలా చెప్పినా ఈ అభిప్రాయానికి వారు రుజువు చూపలేకపోయారు. వారి అభిప్రాయం సరి కాదని ఈ రచయిత నమ్మకం. “బంధించి”– క్రీస్తు మొదటి సారి వచ్చినప్పుడు ఆయన ఒక విధంగా సైతాన్ను బంధించాడు (మత్తయి 12:29). సైతాను ఈ యుగమంతట్లో బంధితుడై ఉన్నాడనీ ప్రకటన గ్రంథం 20:1-3 దాని గురించిన మాటే అనీ కొందరు నేర్పారు. కానీ అది నిజమైతే సైతానును బంధించిన గొలుసు చాలా పొడవైనదన్నమాట! ప్రకటన గ్రంథం 12:10, ప్రకటన గ్రంథం 12:12-13, ప్రకటన గ్రంథం 12:17; 1 పేతురు 5:8; ఎఫెసీయులకు 2:2; ఎఫెసీయులకు 6:11-12 చూడండి. ఎఫెసీయులకు 20:1-3 లో సైతానును బంధించేది క్రీస్తు కాదు గాని ఒక దేవదూత అని మనం గమనించాలి. దీని గురించి క్రొత్త ఒడంబడిక గ్రంథమంతట్లోనూ మరో మాట ఎక్కడా లేదు. సైతాను ఈ శతాబ్దాలన్నీ అగాధంలో ఉంటూ లోకప్రజలను మోసగించలేక ఉన్నాడని ఒక్క సూచన కూడా లేదు. సైతానును ఈ దేవదూత బంధించి అగాధంలో పడవేయడం భవిష్యత్తులో ఉందని ఈ నోట్స్ రచయిత గట్టి నమ్మకం.

3. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.

“ఇక జనాలను మోసగించకుండా”– ఇప్పుడు సైతాను లోక జనాలను మోసగిస్తూనే ఉన్నాడు (ప్రకటన గ్రంథం 12:9), కాబట్టి ఈ సంఘటన ఇంకా భవిష్యత్తులో ఉంటుందని మనం నిస్సందేహంగా నమ్మవచ్చు. 2 కోరింథీయులకు 4:4; 2 కోరింథీయులకు 11:3, 2 కోరింథీయులకు 11:14-15; 2 థెస్సలొనీకయులకు 2:9; 1 తిమోతికి 4:1 కూడా చూడండి. “మూసివేసి...ముద్ర వేశాడు”– యెషయా 24:21-23 పోల్చి చూడండి. సైతాను ఎంత మాత్రమూ అగాధంలో నుంచి బయటికి వచ్చి భూమిమీద అడుగు పెట్టలేకపోతాడని దీని స్పష్టమైన అర్థం. “కొద్ది కాలానికి”– వ 7.

4. అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయ తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి
దానియేలు 7:9, దానియేలు 7:22

“సింహాసనాలనూ”– ఇవి ఎక్కడ ఉంటాయో చెప్పలేదు గాని వ 1-9లోని దృశ్యం భూమి మీదే ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తున్నది. వ 1 లో దేవదూత “పరలోకం నుంచి” వచ్చాడు, వ 8,9లో భూమి మీద జరగబోయే సంఘటనలు ఉన్నాయి. “తీర్పు తీర్చడానికి అధికారం”– మత్తయి 19:28 పోల్చి చూడండి. “ఆత్మలను”– ఆత్మలను చూడడం సాధ్యమా? యోహాను చూశాడు గదా. “మృగాన్నయినా”– క్రీస్తు విరోధి (మృగం) ఈ యుగాంతం సమయం కాకముందు లోకంలో ఉంటాడు. తాను మళ్ళీ వచ్చేటప్పుడు క్రీస్తు అతణ్ణి శిక్షిస్తాడు (ప్రకటన గ్రంథం 19:20; 2 థెస్సలొనీకయులకు 2:3-8). ఈ వచనంలోని సంఘటన ఈ తరువాతే జరుగబోతుంది. “బ్రతికి”– తరువాత వచనంలో ఇది “పునర్జీవితం” అని రాసి ఉంది. అంటే ఆ ఆత్మలు ముందున్న శరీరాలలోకి మళ్ళీ వచ్చి ఆ శరీరాలు మళ్ళీ బ్రతకడం అన్నమాట. “వెయ్యి సంవత్సరాలు”– అంటే సైతాను అగాధంలో ఉన్నంత కాలం. ఈ ప్రస్తుత భూలోకంపై క్రీస్తు తన విశ్వాసులతో కూడా ఎంత కాలం పరిపాలిస్తాడన్న విషయం బైబిలు అంతట్లో వెల్లడి అయింది ఈ ఒక్క స్థలంలో మాత్రమే. అయితే ఈ పుస్తకం దేవుడు ప్రత్యేకంగా వెల్లడి చేసినది గనుక అంతకుముందు ఆయన వెల్లడి చేయని కొన్ని సంగతులు ఇందులో ఉండడం ఆశ్చర్యకరం కాదు. పాత ఒడంబడిక గ్రంథంలో క్రీస్తు పరిపాలన గురించిన భవిష్యద్వాక్కులు యెషయా 2:1-4; యెషయా 9:6-7; యెషయా 11:4-16; యెషయా 24:23; యెషయా 32:1-5; యెషయా 35:1-10; దానియేలు 2:34-35, దానియేలు 2:44-45; జెకర్యా 14:8-21 మొదలైనవి. క్రీస్తు పరిపాలన రెండు భాగాలుగా విభజించబడి ఉంటుంది. వెయ్యేళ్ళ పరిపాలన ఆయన శాశ్వత పరిపాలనకు ఆరంభం మాత్రమే. క్రీస్తు వచ్చిన తరువాత ఆయన అక్షరాలా ఈ ప్రస్తుత భూలోకంలో ఉండి పరిపాలించడని చెప్పే కొందరు క్రైస్తవ పండితులు ఉన్నారు. పాత ఒడంబడిక గ్రంథంలో ఇస్రాయేల్‌ప్రజకు దేవుడు చేసిన మహిమ, ధన్యత గురించిన వాగ్దానాలు ప్రస్తుత యుగంలో క్రీస్తు సంఘంలో నెరవేరుతున్నాయి, సైతానును ఇప్పటికే పూర్తిగా బంధించడం జరిగింది, విశ్వాసులు ఇప్పుడే క్రీస్తుతో కూడా పరిపాలిస్తున్నారు అని వారిలో కొందరు నేర్పుతారు. మరి కొందరు ఈ వచనంలో “వెయ్యి సంవత్సరాలు” అక్షరాలా 1,000 ఏళ్ళు కాదనీ, ఇవి ఈ భూలోకానికి సంబంధించినవి కావనీ, విశ్వాసులు పరిపాలించేది పరలోకంలోనే అనీ నేర్పుతారు. వారి అభిప్రాయాలకు వారు ఇచ్చిన కారణాలు ఈ నోట్స్ రచయితకు మంచివిగా బైబిలుకు అనుగుణమైనవిగా ఎంత మాత్రం అనిపించడం లేదు. “క్రీస్తుతో...పరిపాలన చేశారు”– ఇది క్రీస్తు చేసిన వాగ్దానం ప్రకారమే (ప్రకటన గ్రంథం 3:21). ఇక్కడ ఈ వచనంలో మృగం చేతుల్లో శిరచ్ఛేదం అనుభవించినవారు క్రీస్తుతోకూడా ఏలుతారని మాత్రమే రాసి ఉన్నా ఇతర విశ్వాసులు ఆయనతో ఏలరని అర్థం కాదు. ఇతర చోట్ల వారు కూడా ఏలుతారని వెల్లడి అయింది. ప్రకటన గ్రంథం 5:10; 2 తిమోతికి 2:12; రోమీయులకు 8:17; లూకా 19:15-17, లూకా 19:19 కూడా చూడండి.

5. ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.
దానియేలు 7:27

దీన్ని బట్టి చనిపోయిన మనుషులు రెండు వేరువేరు కాలాల్లో సజీవంగా లేస్తారు. “తక్కినవారు”– తమ పాపాలలో చనిపోయిన అవిశ్వాసులన్నమాట. యోహాను 5:28-29 పోల్చి చూడండి. ఫిలిప్పీయులకు 3:11; లూకా 20:35 నోట్స్ చూడండి. విశ్వాసుల పునర్జీవితం గురించిన ఇతర వచనాలు 1 కోరింథీయులకు 15:20-25, 1 కోరింథీయులకు 15:42-44, 1 కోరింథీయులకు 15:51-53; 1 థెస్సలొనీకయులకు 4:14-17.

6. ఈ మొదటి పునరుత్థానములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
నిర్గమకాండము 19:6, యెషయా 61:6

“ధన్యులూ పవిత్రులూ”– ఈ యుగమంతట్లోని క్రీస్తు నిజ విశ్వాసులందరికీ వర్తించే మాటలు (మత్తయి 5:3; ఆదికాండము 12:1-3; సంఖ్యాకాండము 6:22-27; యోహాను 17:17; రోమీయులకు 1:1; ఎఫెసీయులకు 1:4; ఎఫెసీయులకు 2:21; కొలొస్సయులకు 1:1; కొలొస్సయులకు 3:12; హెబ్రీయులకు 10:10, హెబ్రీయులకు 10:14; 1 పేతురు 2:9 చూడండి). “రెండో చావు”– వ 14. “యాజులై”– ప్రకటన గ్రంథం 1:6; ప్రకటన గ్రంథం 5:10; 1 పేతురు 2:5, 1 పేతురు 2:9. “ఆయనతోకూడా...చేస్తారు”– భూలోకంలో క్రీస్తు పరిపాలన గురించిన వివరణలు ఇక్కడ ఇవ్వలేదు. ఇవ్వడం అవసరం లేదు, ఎందుకంటే దేవుడు బైబిలులో ఇతర చోట్ల ఆ వివరణలు ఇచ్చాడు. ఉదాహరణగా యెషయా 2:1-4 నోట్స్‌తో కూడా చూడండి.

7. వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.

వ 3లో రాసి ఉన్న కొద్ది కాలం ఇది. ఇది ప్రకటన గ్రంథం 12:12 లోని కొద్ది కాలం కాదు. అక్కడ సైతాన్ను పరలోకంనుంచి భూమికి పడవేసే సంగతి ఉంది. ఇక్కడ వాడిని అగాధంలో నుంచి విడుదల చేసే సంగతి ఉంది.

8. భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.
యెహెఙ్కేలు 7:2, యెహెఙ్కేలు 38:2

“గోగు, మాగోగులను”– యెహెఙ్కేలు 38:2 పోల్చి చూడండి. యెహెజ్కేలు గ్రంథంలో గోగు అంటే మాగోగుకు అధిపతి. మాగోగు, ఇస్రాయేల్ దేశంమీదికి దండెత్తి వచ్చే జనాలు ఇస్రాయేల్‌కు ఉత్తరాన చాలా దూరాన ఉన్నాయి (యెహెఙ్కేలు 38:6, యెహెఙ్కేలు 38:15; యెహెఙ్కేలు 39:2). అవి ఈ యుగం సమాప్తం కాకముందు, వెయ్యేళ్ళ పరిపాలనకు ముందు ఇస్రాయేల్‌పై దాడి చేస్తాయని అనుకోవడానికి కారణాలు లేకపోలేదు (యెహెఙ్కేలు 38:1, యెహెఙ్కేలు 38:8 నోట్స్ చూడండి). ప్రకటన గ్రంథంలోనైతే గోగు, మాగోగు రెండూ “భూమి నలుదిక్కులా ఉన్న” జనాలు అని అర్థం. అంతేగాక ఈ దాడి వెయ్యేళ్ళ పరిపాలన తరువాతే జరగబోతుంది. ఇలా ఉంటే ఈ జనాలను “గోగు, మాగోగుల”ని ఇక్కడ అనడం ఎందుకు? బహుశా వాటి లక్షణాలను బయట పెట్టడం కోసం. యెహె 38,39 అధ్యాయాల్లోని జనాలకు ఉన్నంత తిరుగుబాటు మనసు, మొండిపట్టు, భ్రష్టత్వం వీరికి కూడా ఉంటాయన్న మాట. “మోసపుచ్చి”– సైతాను విడుదల కాగానే మునుపు చేస్తున్నట్టు మళ్ళీ చేయడం తల పెడతాడు. వాటి ప్రయత్నాలు మళ్ళీ సఫలం అవుతాయి. ప్రపంచమంతట్లో న్యాయం, నీతి, శాంతి, ధన్యత, శ్రేయస్సులతో కూడిన వెయ్యేళ్ళ పరిపూర్ణ పరిపాలన తరువాత కూడా కొందరు మనుషుల హృదయాలు ఎప్పటిలాగే తిరుగుబాటు, భ్రష్టత్వంతో నిండి ఉంటాయని త్వరలో బట్టబయలవుతుంది. వీరు వెయ్యేళ్ళ పరిపాలన కాలంలో పుట్టి పెరిగినవారై ఉంటారు. దాని అంతంలో వారి తిరుగుబాటు మూలంగా దేవుడు మానవ హృదయ కాఠిన్యం, భ్రష్టత్వం గురించి నేర్పించాలనుకొన్న మరి కొన్ని పాఠాలు వెల్లడి అవుతాయి.

9. వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.
2 రాజులు 1:10, యిర్మియా 11:15, యిర్మియా 12:7, యెహెఙ్కేలు 39:6, హబక్కూకు 1:6

“భూమి విశాలం మీద”– ఇది యెహె 38,39 అధ్యాయాల్లోని జనాల గురించి రాసి లేదు (యెహెఙ్కేలు 38:6, యెహెఙ్కేలు 38:15; యెహెఙ్కేలు 39:2). “ప్రియ నగరం”– కీర్తనల గ్రంథము 87:2. “పరలోకం నుంచి మంటలు”– యెహెఙ్కేలు 38:22; యెహెఙ్కేలు 39:6; కీర్తనల గ్రంథము 11:6-7 పోల్చి చూడండి.

10. వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.
ఆదికాండము 19:24, కీర్తనల గ్రంథము 11:6, యెషయా 30:33, యెహెఙ్కేలు 38:22

“వారు”– దుష్ట త్రిత్వమై ఉన్న ముగ్గురు వ్యక్తులు. అప్పటికి వారిలో ఇద్దరు 1000 ఏళ్ళుగా అగ్ని సరస్సులో ఉండి ఉంటారు (ప్రకటన గ్రంథం 19:20). అగ్ని సరస్సులో పడవేయడం అనేది వ్యక్తుల సమూల నాశనం కాదు, అప్పటి నుంచి వారు ఉనికిలో ఉండరని అర్థం కాదు. “యుగయుగాలకు”– ప్రకటన గ్రంథం 14:11.

11. మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.
కీర్తనల గ్రంథము 114:3, కీర్తనల గ్రంథము 114:7, యెషయా 6:1, దానియేలు 2:35, దానియేలు 7:9

ప్రజలకు చివరి తీర్పు, ఇప్పుడున్న భూమ్యాకాశాల స్థితి అంతం. ఇప్పుడు దేవుని సింహాసనం “కృపా సింహాసనం” (హెబ్రీయులకు 4:16). అయితే దేవుని కృప వద్దన్నవారు వారి పాపాలన్నిటి విషయం న్యాయ శిక్షకు గురి అవుతారు. ఈ తీర్పు జరగబోయేది ఆ వెయ్యేళ్ళ తరువాతా? వెయ్యేళ్ళకు ముందా? ఇక్కడున్న మాటలను బట్టి ఖచ్చితంగా చెప్పడం కష్టతరం. బహుశా ఇక్కడ వెల్లడి అయినది దేవుడు ఏ నియమాలను అనుసరించి తీర్పు తీరుస్తాడు అన్న సంగతి మాత్రమే కావచ్చు, అది జరిగే సమయం కాకపోవచ్చు. అయితే దీని సందర్భాన్ని బట్టి, ముందున్న వచనాల్ని బట్టి వెయ్యేళ్ళ పరిపాలన తరువాత ఈ తీర్పు జరగబోయేదై ఉన్నట్టుందని మాత్రం చెప్పవచ్చు. కానీ వెయ్యేళ్ళ పరిపాలనకు ముందు కూడా ఇలాంటి తీర్పు సమయం ఉండదని అర్థం కాదు.

12. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
నిర్గమకాండము 32:33, కీర్తనల గ్రంథము 28:4, కీర్తనల గ్రంథము 62:12, కీర్తనల గ్రంథము 69:28, సామెతలు 24:12, యెషయా 59:18, యిర్మియా 17:10, దానియేలు 7:10, దానియేలు 12:1

“చనిపోయినవారు”– వీరు రెండో పునర్జీవిత సమయంలో లేపబడబోయేవారు (వ 5). వారు లేపబడ్డా వారిని ఇక్కడ చనిపోయినవారని అనబడ్డవారు, ఎందుకంటే వారు ఆధ్యాత్మిక జీవం లేనివారు. ఎఫెసీయులకు 2:1; 1 తిమోతికి 5:6 పోల్చి చూడండి. “గ్రంథాలు”– ఇది జీవ గ్రంథం కాదు. ఇందులో ఈ చనిపోయినవారు లోకంలో జీవించి ఉండగా చేసిన కార్యకలాపాలు రాసి ఉంటాయి. “జీవ గ్రంథం”– ప్రకటన గ్రంథం 3:5 నోట్. “తీర్పుకు గురి అయ్యారు”– కీర్తనల గ్రంథము 9:7-8; కీర్తనల గ్రంథము 82:8; కీర్తనల గ్రంథము 94:2; కీర్తనల గ్రంథము 96:10-13; దానియేలు 7:9-10.

13. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.
కీర్తనల గ్రంథము 28:4, కీర్తనల గ్రంథము 62:12, సామెతలు 24:12, యెషయా 59:18, యిర్మియా 17:10

“సముద్రం”– సముద్రం లోతులోకి మునిగిపోయిన వారిని, సొరచేపలు తిన్నవారిని కూడా దేవుడు ఈ తీర్పుకు రప్పిస్తాడు. చనిపోయినవారంతా ఆ తెల్లని మహా సింహాసనం ఎదుట నిలబడుతారు. ఎవరూ తప్పించుకోరు. “మృత్యువు”– మనుషుల ఆత్మలను వారి శరీరాలనుంచి వేరు చేసే శక్తి మరణం. అయితే వాటిని వేరువేరుగా ఉన్న స్థితిలో ఉంచడం మృత్యువు చేత కాకపోతుంది. “పాతాళం”– దేవుని తీర్పు సమయం వచ్చే వరకూ అవిశ్వాసులు ఉంచబడ్డ స్థలం. లూకా 16:23 చూడండి.

14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

అప్పుడు మృత్యువు ఆత్మలను శరీరాలనుంచి ఇక వేరుగా ఉంచక, దేవుని నుంచి దుర్మార్గులు శాశ్వతంగా వేరు కావడంలో పాల్గొంటుంది. అప్పుడు పాతాళం తీర్పువరకూ దుర్మార్గులు ఉంచబడ్డ స్థలంగా ఉండదు. దుర్మార్గులంతా తీర్పుకు గురి అయి పాతాళం నరకంతో, అగ్ని సరస్సుతో ఏకం అవుతుంది. “రెండో చావు”– ఇది సమస్తమైన శాంతికి, ఆనందానికి, ధన్యతలకు మూలాధారమైన దేవుని సన్నిధి నుంచి అనంతమైన ఎడబాటు (మత్తయి 25:41; 2 థెస్సలొనీకయులకు 1:8-9).

15. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
యెషయా 4:3, యెషయా 30:33, నిర్గమకాండము 32:33, కీర్తనల గ్రంథము 69:28, దానియేలు 12:1

జీవ గ్రంథంలో ఎవరి పేర్లు లేవో వారు ఆధ్యాత్మిక జీవం లేనివారు (యోహాను 1:12-13; యోహాను 3:36; ఎఫెసీయులకు 2:5). వారు ప్రకటన గ్రంథం 21:8 లో రాసి ఉన్న పాపాలు చేస్తూ వచ్చినవారై ఉంటారు. వారు ఏ శిక్షకు తగినవారో ఖచ్చితంగా ఆ శిక్షకే గురి అవుతారు. ఈ న్యాయమైన తీర్పు, శిక్షల నుంచి మనం తప్పించుకోగల ఒకే ఒక మార్గం మళ్ళీ జ్ఞాపకం చేసుకొందాం – యోహాను 5:24; రోమీయులకు 8:1.



Powered by Sajeeva Vahini Study Bible (Beta). Copyright© Sajeeva Vahini. All Rights Reserved.
Revelation - ప్రకటన గ్రంథము 20 - బైబిల్ అధ్యయనం - Telugu Study Bible - Adhyayana Bible

ప్రకటన 20:1 మరియు పెద్దసంకెళ్లను చేత పట్టుకొని అగాధము యొక్క తాళపుచెవిగల యొక దేవదూత పరలోకమునుండి దిగివచ్చుట చూచితిని.
అగాధము అనగా పాతాళము. క్రీస్తును చూచిన దయ్యములు గడగడ వణకుచున్నవి. దావీదు తాళపుచెవి కలిగి, యెవడును వేయ లేకుండ తీయువాడును, ఎవడును తీయలేకుండ వేయువాడునైన సత్యస్వరూపియగు పరిశుద్ధుడు (ప్రక 3:7), మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపుచెవులు తన స్వాధీనములో (ప్రక 1:18) వుంచుకొని యున్న ప్రభువు ఎప్పుడు ఎవరికి అధికారము ఇస్తారో ఎవరికీ తెలియదు.
ప్రభువు సంఘమును గూర్చి చెప్పిన మాట మనకు గుర్తుకు వస్తుంది. పరలోకరాజ్యముయొక్క తాళపుచెవులు నీ కిచ్చెదను, నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోక మందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని చెప్పెను (మత్త 16:19). మరి ఇప్పుడు గమనించి నట్లైతే; అగాధము యొక్క తాళపు చెవులు ఒక దూత చేతికి ఇచ్చారు. ఆ దూత ఎవరు? ఇది మర్మము.
ఐతే పరిశుద్ధాత్మ దేవుడు అపో. పౌలు గారి ద్వారా బయలుపరచినది ఏమనగా: సమాధాన కర్తయగు దేవుడు సాతానును మీ కాళ్లక్రింద శీఘ్రముగా చితుక త్రొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై యుండును గాక (రోమా 16:20). అట్లు ఒక రక్షింపబడిన విశ్వాసికి లేదా అపోస్తలులకు దేవుడు పరలోకములో అధికారము ఇవ్వబోవుచున్నాడు. అంతే కాదు, యేసు వారితో ఇట్లనెను(ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు (మత్త 19:28).
ప్రియ స్నేహితుడా, క్రైస్తవ్యము కేవలము ఈ జీవిత కాలము చెప్పుకునే మతము కాదు, పరలోకమునకు చేర్చు మార్గము. మన పౌర స్థితి పరలోకములో వున్నది. ఈ లోకము మనలను ద్వేషిస్తుంది, పరలోకములో మనకు గొప్ప నిత్య స్వాస్థ్యమున్నదని మరువ రాదు. ప్రభువు రాకడవరకు సజీవులమై నిలిచియున్న వారమై మధ్యాకాశములో ఆయనతో కలుసుకునే ధన్యత మనకు దేవుడు దయచేయును గాక. ఆమెన్

ప్రకటన 20:3 ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు ఇక జనములను మోసపరచకుండునట్లు అగాధమును మూసి దానికి ముద్ర వేసెను; అటుపిమ్మట వాడు కొంచెము కాలము విడిచి పెట్టబడవలెను.
ఆ దినమున యెహోవా గట్టిదై గొప్పదై బలమైన తన ఖడ్గము పట్టుకొనును తీవ్రసర్పమైన మకరమును వంకరసర్పమైన మకరమును ఆయన దండించును సముద్రముమీదనున్న మకరమును సంహరించును (యెష 27:1). ఐతే దానిని మూసిన అగాధము లేక పాతాళము వెయ్యి సంవత్సరములు మూయబడినది. అది దానికి ఒక యుగము కాని, మనదేవునికి ఒక దినము. నీ దృష్టికి వేయి సంవత్సరములు గతించిన నిన్నటివలె నున్నవి రాత్రియందలి యొక జామువలెనున్నవి (కీర్త 90:4). ప్రియులారా, ఒక సంగతి మరచిపోకుడి. ఏమనగా ప్రభువు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరముల వలెను, వెయ్యి సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి (2 పేతు 3:8).
యోసేపును పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిన ఆ గుంట వట్టిది అందులో నీళ్లులేవు (ఆది 37:24). అతడు కొద్ది సేపటికే వెలుపలికి తీయబడినాడు. నాటనుండి నేటివరకూ అపవాది తన పని తాను చేసుకుంటూ పోతూనే వుంది.
ఒక రాయి తీసికొని వచ్చి సింహములగుహ ద్వారమున వేసి దానియేలును మూసిరి; మరియు దానియేలును గూర్చి రాజుయొక్క తీర్మానము మారునేమోయని, రాజు ముద్రను అతని యధికారుల ముద్రను వేసి దాని ముద్రించిరి (దాని 6:17). ఒక్క రాత్రి కూడా పూర్తికాక ముందే రాజు తెల్లవారు జాముననే దానియేలును ఆ గుహలోనుండి దేవుడు వెలుపలికి తీయించాడు.
యిర్మీయాను పట్టుకొని కారా గృహములోనున్న రాజకుమారుడగు మల్కీయా గోతి లోనికి దింపిరి. అందులోనికి యిర్మీయాను త్రాళ్లతో దింపినప్పుడు ఆ గోతిలో నీళ్లు లేవు, బురదమాత్రమే యుండెను, ఆ బురదలో యిర్మీయా దిగబడెను (యిర్మీ 38:6). కొద్ది సమయములోనే దేవుడు అతనికి విడుదల అనుగ్రహించెను.
ఇట్లుండగా ఏమందుము,యేసును సైతము చంపించి సమాధి చేయించి దానికి రాయి దొర్లించి ముద్ర వేయించిన అపవాది ఒకే ఒక్క రోజు భద్రపరచ గలిగినది. ముద్రవేసిన రోజును రాయి దొరలింప బడిన రోజును వినాయించితే ఒక్క రోజు మాత్రమే అది మూయబడిన సమాధి.
యోహానును, పేతురును, అపోస్తలుల మొదలు నేటి దినముల వరకూ అనేకమంది సువార్తికులను బందిస్తూనే వున్నది సాతాను.
ఐతే అపవాది సమాధి వెయ్యి యేండ్లు. ఘనత మహిమ ప్రభావములు మన దేవునికే చెల్లును గాక. ఆమెన్

ప్రకటన 20:4 అంతట సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయక తమ నొసళ్లయందు గాని చేతులయందు గాని దాని ముద్రవేయించుకొనని వారిని, యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రదికినవారై, వెయ్యి సంవత్సరములు క్రీస్తుతోకూడ రాజ్యము చేసిరి

ప్రకటన 20:5 ఆ వెయ్యి సంవత్సరములు గడచువరకు కడమ మృతులు బ్రదుక లేదు; ఇదియే మొదటి పునరుత్థానము.

ప్రకటన 20:6 ఈ మొదటి పునరుత్థాన ములో పాలుగలవారు ధన్యులును పరిశుద్ధులునై యుందురు. ఇట్టివారిమీద రెండవ మరణమునకు అధికారములేదు; వీరు దేవునికిని క్రీస్తుకును యాజకులై క్రీస్తుతోకూడ వెయ్యి సంవత్సరములు రాజ్యము చేయుదురు.
క్రీస్తు వారి వెయ్యేండ్ల పరిపాలన అంటే ఇదే. ఈ దర్శనములో యోహాను గారు ఎన్ని సిమ్హాసనములను చూచారు, తెలియదు. ఆ సింహాసనముల మీద కూర్చుని కొందరు వున్నారు అన్నట్లు వ్రాయుచున్నారేగాని, ప్రభువు సింహాసనాసీనుడుగా వున్నారు అని వ్రాయలేదు. దాని 7:9లో చూసినప్పుడు సింహాసనములను వేయుట చూచినట్లును; మహా వృద్ధుడొకడు కూర్చుండి యున్నట్లును వ్రాయబడినది.
ప్రభువైన ఏసుక్రీస్తు వారు శిష్యులతో: (ప్రపంచ) పునర్జననమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనముమీద ఆసీనుడై యుండునపుడు నన్ను వెంబడించిన మీరును పండ్రెండు సింహాసనములమీద ఆసీనులై ఇశ్రాయేలు పండ్రెండు గోత్రములవారికి తీర్పుతీర్చుదురు (మత్త 19:28) అని చెప్పిన మాట మనము జ్ఞాపకము చేసుకుందాము. పరసంబంధమైన ఈ వాగ్దానము వెనుక దాగియున్న మర్మము ఏదనగా; మీరందరూ కాబోయే హతసాక్షులే అని యేసయ్య మాట అని గ్రహించాలి మనము.
వారిని గూర్చియే పో. పౌలు గారు: పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరెరుగరా? అనియూ; మనము దేవదూతలకు తీర్పు తీర్చుదుమని యెరుగరా? (1 కొరిం 6:2,3) అంటూ అడుగుతున్నారు. కాని, ఆ పరిశుద్ధులకు ఉండవలసిన అర్హతలు ఇక్కడ మనకు స్పష్టముగాకనబడుచున్నవి.
దాని ముద్రవేయించుకొనని వారు, దేవుని నిమిత్తము శిరచ్ఛేదనము చేయబడిన వారు. బ్రదికినవారై అనగా పునరుత్థానులై క్రీస్తుతో కూడా వెయ్యియేండ్లు పరిపాలన చేస్తారు. వారేవరనగా; పై చెప్పబడిన రీతిగా క్రీస్తు నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును సాక్ష్యమిచ్చి శిరచ్చేదనము చేయబడినవారు, రాళ్ళతో కొట్టబడి చంపబడినవారు, సింహాల బోనులో వేయబడి మరణించినవారు, తల్లక్రిందులుగా సిలువ వేయబడినవారు, నిలువు స్తంభమునకు కట్టివేయబడి కాళ్ళ క్రింద ఉంచిన అగ్నికి ఆహుతి అయినవారు, సజీవముగానే సమాధి చేయబడిన వారు.
వీరే సజీవుడైన ఏసుక్రీస్తుకు నిత్యమైన పరలోకములో పరిశుద్ధ యాజకులు. ప్రియ స్నేహితుడా, నీ త్యాగము ఏది ? క్రీస్తు సాక్షిగా నిలబడటానికి నీ నిశ్చయత ఏమిటీ ? సువార్త ప్రకటించుటకు నీవు వెచ్చించున్న సమయము ఎంత ? రక్షింపబడిన నీవు ఆలోచించు సోదరా. ప్రభువు నీతోనుండును గాక. ఆమెన్

మొదటి పునరుత్థానము:
మొదటి పునరుత్థానములో ఎవరెవరు వుంటారు?
ప్రక 20:4 గమనించినట్లైతే; సింహాసనములను చూచితిని; వాటిమీద ఆసీనులై యుండువారికి విమర్శచేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు 1.క్రూరమృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారముచేయని వారు, 2.తమ నొసళ్లయందుగాని చేతులయందుగాని ముద్ర వేయించుకొననివారు, 3.యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును శిరచ్చేదనము చేయబడిన వారు.
వారు బ్రదికినవారై వెయ్యి సంవత్సరములు క్రీస్తుతో కూడ రాజ్యము చేసిరి. ఈ సమయములో మనము జ్ఞాపకము చేసుకొనవలసిన ప్రవచన భాగములు ఏవనగా :
1) ప్రవచనమెత్తి వారితో ఇట్లనుముప్రభువగు యెహోవా సెల విచ్చునదేమనగా నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలోనుండి మిమ్మును బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశములోనికి తోడుకొనివచ్చెదను. (యెహే 37:12 ).
2) సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు; కొందరు నిత్యజీవము అనుభ వించుటకును, కొందరు నిందపాలగుటకును నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు (దాని 12:2 ).
3) సిలువలో యేసు బిగ్గరగా కేకవేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు రెండుగా చినిగెను; భూమి వణకెను; బండలు బద్ద లాయెను; సమాధులు తెరవబడెను; నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను (మత్త 27:50-52).
4)యేసునందు నిద్రించినవారిని దేవుడాయనతో కూడ వెంటబెట్టుకొని వచ్చును (1 థెస్స 4:14). బూర మ్రోగును; అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు (1 కొరిం 15:52). మూడుదినములన్నరయైన పిమ్మట దేవునియొద్ద నుండి జీవాత్మ వచ్చి వారిలో ప్రవేశించెను గనుక వారు పాదములు ఊని నిలిచిరి (ప్రక 11:11).
ఐతే; నిద్రించినవారిలో ప్రథమఫలముగా క్రీస్తు మృతులలోనుండి లేపబడియున్నాడు (1 కొరిం 15:20). చివరిగా మనము గుర్తుంచుకొనవలసినది ఏమనగా: జగదుత్పత్తి మొదలుకొని వధింప బడియున్న గొఱ్ఱపిల్లయొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఈ మొదటి పునరుత్థానములో లేపబడలేదు అనగా వారు వెయ్యి ఏండ్ల పాలనలో పాలుపొందలేదు ఏలయన వారు బ్రడుకలేదు. సాతాను చెరలో ఉన్నందున ఆ వెయ్యి యేండ్లు పరిశుద్ధుల సంఘము సంపూర్ణ స్వతంత్రముతో ప్రభువును ఆరాధించును.
అరమరికలుండవు. కక్షలు కార్పణ్యములు వుండవు. ఆ దినమున నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు కొదమ సింహములను భుజంగములను అణగ ద్రొక్కె దవు (కీర్త 91:13). తోడేలు గొఱ్ఱపిల్లయొద్ద వాసముచేయును చిఱుతపులి మేకపిల్లయొద్ద పండుకొనును దూడయు కొదమసింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. ఆవులు ఎలుగులు కూడి మేయును వాటి పిల్లలు ఒక్క చోటనే పండుకొనును ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలుకుడుచుపిల్ల నాగుపాము పుట్టయొద్ద ఆట్లాడును మిడినాగు పుట్టమీద పాలువిడిచిన పిల్ల తన చెయ్యి చాచును.
నా పరిశుద్ధ పర్వతమందంతటను ఏ మృగమును హాని చేయదు నాశముచేయదు సముద్రము జలముతో నిండియున్నట్టు లోకము యెహోవానుగూర్చిన జ్ఞానముతో నిండి యుండును (యెష 11:6-9). ప్రియ స్నేహితుడా, పునరుత్దాన అనుభవమే లేకుండా పునరుత్దానము పొందగాలవా ? పునరుత్దాన అనుభవం వేరు, పునరుత్దానం వేరు అని గ్రహించుము. త్వరపడి మారుమనస్సు నిమిత్తమై బాప్తిస్మము పొందుము.
క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మమువలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితివిు. మరియు ఆయన మరణముయొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యముగలవారమైన యెడల, ఆయన పునరుత్థా నముయొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యముగల వారమై యుందుము (రోమా 6:3-5). ప్రభువు ఆత్మ మనతో నుండును గాక. ఆమెన్

ప్రకటన 20:7 వెయ్యి సంవత్సరములు గడచిన తరువాత సాతాను తానున్న చెరలోనుండి విడిపింపబడును.

ప్రకటన 20:8 భూమి నలు దిశలయందుండు జనములను, లెక్కకుసముద్రపు ఇసుకవలె ఉన్న గోగు మాగోగు అనువారిని మోసపరచి వారిని యుద్ధమునకు పోగుచేయుటకై వాడు బయలుదేరును.

ప్రకటన 20:9 వారు భూమియందంతట వ్యాపించి, పరిశుద్ధుల శిబిరమును ప్రియమైన పట్టణమును ముట్టడివేయగా పరలోకములోనుండి అగ్ని దిగివచ్చి వారిని దహించెను.

ప్రకటన 20:10 వారిని మోసపరచిన అపవాది అగ్ని గంధకములుగల గుండములో పడవేయబడెను. అచ్చట ఆ క్రూరమృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు; వారు యుగయుగములు రాత్రింబగళ్లు బాధింపబడుదురు.
అంతిమ తీర్పు నిమిత్తము సాతానును విడువగా అదియూ దాని అనుచరులును కలిసి పరిశుద్ధుల మీద యుద్ధమునకు దిగుదురు. భూమి యొక్క నలుదిశల దేవుని తీర్పు అమలు కానున్నదని ప్రవచన సారము. అంతము ఒక ప్రాంతమునకో ఒక దేశమునకో కాదు;
నరపుత్రుడా, ప్రకటింపుము; ఇశ్రాయేలీయుల దేశమునకు అంతము వచ్చియున్నది, నలుదిక్కుల దేశమునకు అంతము వచ్చేయున్నదని ప్రభు వగు యెహోవా సెలవిచ్చుచున్నాడు; ఇప్పుడు నీకు అంతము వచ్చేయున్నది (యెహే 7:2). గోగు మాగోగు అను పేళ్ళు క్రీస్తు విరోధులకు సూచనగా వ్రాయబడుచున్నవి. నరపుత్రుడా, మాగోగు దేశపువాడగు గోగు, అనగా రోషునకును మెషెకునకును తుబాలునకును అధిపతియైనవానితట్టు అభి ముఖుడవై అతని గూర్చి ఈ మాట యెత్తి ప్రవచింపుము ప్రభువైన యెహోవా సెలవిచ్చున దేమనగా రోషునకును మెషెకు నకును తుబాలునకును అధిపతియగు గోగూ, నేను నీకు విరోధినై యున్నాను (యెహే 38:2,3).
అట్లు విడువబడిన అపవాదియు దాని అనుచరులును పరిశుద్ధ స్థలములను ఆక్రమించ చూచునప్పుడు దేవుని అగ్ని దిగివచ్చును. యెహోవా కోపాగ్ని రగులుకొనును పాతాళాగాధమువరకు అది దహించును అది భూమిని దాని పంటను కాల్చును పర్వతముల పునాదులను రవలబెట్టును (ద్వితీ 32:22).
ఈలోకము కనుమరుగైపోవు సమయమిదే. గ్రహించుము. అయితే ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న క్రుత్యములును కాలిపోవును (2 పేతు 3:10).
ఆ క్రూరమృగమునకు గాని దాని ప్రతిమకు గాని యెవడైనను నమస్కారముచేసి, తన నొసటియందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనినయెడల అగ్నిగంధకములచేత వాడు బాధింపబడును.

ప్రక`టన 20:11 మరియు ధవళమైన మహా సింహాసనమును దానియందు ఆసీనుడైయున్న యొకనిని చూచితిని; భూమ్యాకాశములు ఆయన సముఖమునుండి పారిపోయెను; వాటికి నిలువ చోటు కనబడకపోయెను.

ప్రకటన 20:12 మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.

ప్రకటన 20:13 సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతుల నప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.

ప్రకటన 20:14 మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.

ప్రకటన 20:15 ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
తండ్రియైన దేవుని తీర్పు ఈ ధవళసింహాసన తీర్పు అని మనము గ్రహించాలి. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినమువరకు అగ్నికొరకు నిలువచేయబడినవై, అదే వాక్యమువలన భద్రము చేయబడియున్నవి (2 పేతు 3:7).
పరి. యోహాను గారు మహా సింహాసనము అని వ్రాస్తున్నారు. దానినే ప్రవ. యెషయా గారు అత్యున్నత సింహాసనము అని కూడా అభివర్ణించారు. అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడైయుండగా నేను చూచితిని (యెష 6:1). ఆసీనుడైయున్న యొకనిని చూచితిని అని వ్రాయబడుచున్నది. క్రీస్తు అని గాని, వధింపబడినట్లున్న గొర్రెపిల్ల అని గాని వ్రాయలేదు. సింహాసనములను వేయుట చూచితిని; మహా వృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తలవెండ్రుకలు శుద్ధమైన గొఱ్ఱబొచ్చువలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలలవలె మండుచుండెను; దాని చక్ర ములు అగ్నివలె ఉండెను. అగ్నివంటి ప్రవాహము ఆయనయొద్దనుండి ప్రవహించుచుండెను. వేవేలకొలది ఆయనకు పరిచారకులుండిరి; కోట్లకొలది మనుష్యులు ఆయనయెదుట నిలిచిరి, తీర్పుతీర్చుటకై గ్రంథములు తెరువబడెను (దాని 7:9,10).
మరుగైయున్న సంగతి ఏమనగా; తండ్రి యెవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరును కుమారుని ఘనపరచ వలెనని తీర్పుతీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించియున్నాడు (యోహా 5:22,23) అనగా; తండ్రి సమక్షములోనే తండ్రి ఎదుటనే తీర్పు జరుగును. ఈ తీర్పులో వాదోప వాదములు, సాక్ష్యములు, రుజువులు ఏమీ వుండవు. ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబదును.
ప్రభువు దినము దొంగవచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించి పోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దానిమీదనున్న క్రుత్యములును కాలిపోవును. ఇవన్నియు ఇట్లు లయమై పోవునవి గనుక, ఆకాశములు రవులుకొని లయమైపోవు నట్టియు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోవు నట్టియు దేవుని దినపు రాకడకొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మనము పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్తగలవారమై యుండవలెను (2 పేతు 3:10-12). ప్రక 9:12 - మొదటి శ్రమ గతించెను; ప్రక 11:14 - రెండవ శ్రమ గతించెను; ప్రక 20:15 - గ్నిగుండములో పడవేయబడెను లేక మూడవ శ్రమ గతించెను.



Shortcut Links
ప్రకటన గ్రంథం - Revelation : 1 | 2 | 3 | 4 | 5 | 6 | 7 | 8 | 9 | 10 | 11 | 12 | 13 | 14 | 15 | 16 | 17 | 18 | 19 | 20 | 21 | 22 |
ఆదికాండము - Genesis | నిర్గమకాండము - Exodus | లేవీయకాండము - Leviticus | సంఖ్యాకాండము - Numbers | ద్వితీయోపదేశకాండము - Deuteronomy | యెహోషువ - Joshua | న్యాయాధిపతులు - Judges | రూతు - Ruth | 1 సమూయేలు - 1 Samuel | 2 సమూయేలు - 2 Samuel | 1 రాజులు - 1 Kings | 2 రాజులు - 2 Kings | 1 దినవృత్తాంతములు - 1 Chronicles | 2 దినవృత్తాంతములు - 2 Chronicles | ఎజ్రా - Ezra | నెహెమ్యా - Nehemiah | ఎస్తేరు - Esther | యోబు - Job | కీర్తనల గ్రంథము - Psalms | సామెతలు - Proverbs | ప్రసంగి - Ecclesiastes | పరమగీతము - Song of Solomon | యెషయా - Isaiah | యిర్మియా - Jeremiah | విలాపవాక్యములు - Lamentations | యెహెఙ్కేలు - Ezekiel | దానియేలు - Daniel | హోషేయ - Hosea | యోవేలు - Joel | ఆమోసు - Amos | ఓబద్యా - Obadiah | యోనా - Jonah | మీకా - Micah | నహూము - Nahum | హబక్కూకు - Habakkuk | జెఫన్యా - Zephaniah | హగ్గయి - Haggai | జెకర్యా - Zechariah | మలాకీ - Malachi | మత్తయి - Matthew | మార్కు - Mark | లూకా - Luke | యోహాను - John | అపో. కార్యములు - Acts | రోమీయులకు - Romans | 1 కోరింథీయులకు - 1 Corinthians | 2 కోరింథీయులకు - 2 Corinthians | గలతియులకు - Galatians | ఎఫెసీయులకు - Ephesians | ఫిలిప్పీయులకు - Philippians | కొలొస్సయులకు - Colossians | 1 థెస్సలొనీకయులకు - 1 Thessalonians | 2 థెస్సలొనీకయులకు - 2 Thessalonians | 1 తిమోతికి - 1 Timothy | 2 తిమోతికి - 2 Timothy | తీతుకు - Titus | ఫిలేమోనుకు - Philemon | హెబ్రీయులకు - Hebrews | యాకోబు - James | 1 పేతురు - 1 Peter | 2 పేతురు - 2 Peter | 1 యోహాను - 1 John | 2 యోహాను - 2 John | 3 యోహాను - 3 John | యూదా - Judah | ప్రకటన గ్రంథం - Revelation |

Explore Parallel Bibles
21st Century KJV | A Conservative Version | American King James Version (1999) | American Standard Version (1901) | Amplified Bible (1965) | Apostles' Bible Complete (2004) | Bengali Bible | Bible in Basic English (1964) | Bishop's Bible | Complementary English Version (1995) | Coverdale Bible (1535) | Easy to Read Revised Version (2005) | English Jubilee 2000 Bible (2000) | English Lo Parishuddha Grandham | English Standard Version (2001) | Geneva Bible (1599) | Hebrew Names Version | Hindi Bible | Holman Christian Standard Bible (2004) | Holy Bible Revised Version (1885) | Kannada Bible | King James Version (1769) | Literal Translation of Holy Bible (2000) | Malayalam Bible | Modern King James Version (1962) | New American Bible | New American Standard Bible (1995) | New Century Version (1991) | New English Translation (2005) | New International Reader's Version (1998) | New International Version (1984) (US) | New International Version (UK) | New King James Version (1982) | New Life Version (1969) | New Living Translation (1996) | New Revised Standard Version (1989) | Restored Name KJV | Revised Standard Version (1952) | Revised Version (1881-1885) | Revised Webster Update (1995) | Rotherhams Emphasized Bible (1902) | Tamil Bible | Telugu Bible (BSI) | Telugu Bible (WBTC) | The Complete Jewish Bible (1998) | The Darby Bible (1890) | The Douay-Rheims American Bible (1899) | The Message Bible (2002) | The New Jerusalem Bible | The Webster Bible (1833) | Third Millennium Bible (1998) | Today's English Version (Good News Bible) (1992) | Today's New International Version (2005) | Tyndale Bible (1534) | Tyndale-Rogers-Coverdale-Cranmer Bible (1537) | Updated Bible (2006) | Voice In Wilderness (2006) | World English Bible | Wycliffe Bible (1395) | Young's Literal Translation (1898) | Telugu Bible Verse by Verse Explanation | పరిశుద్ధ గ్రంథ వివరణ | Telugu Bible Commentary | Telugu Reference Bible |