యేసు సిలువలో పలికిన యేడు మాటలు - మొదటి మాట


  • Author: Dr. G. Praveen Kumar
  • Category: Daily Devotions - అనుదిన వాహిని - Season 6
  • Reference: Sajeeva Vahini

అనుదిన మన ప్రార్ధనలో అనేక సంగతులు ఉంటూనే ఉంటాయి. చేసే పనిలో ఒత్తిడి పెరిగిపోయినప్పుడు ప్రార్ధన, ప్రార్ధన భారాలు రెండు తగ్గిపోతాయి. అనుకోకుండా ఏదైనా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తే ప్రార్ధనలో ఎక్కువ భాగం మనకోసమే...చివర్లో కాస్త కుటుంబంకోసం లేదా అత్యవసరం ఉన్న సన్నిహితుల కోసం.

సిలువలో యేసు క్రీస్తు జీవితం దాదాపుగా ముగిసినప్పుడు, బాధ తీవ్రంగా ఉన్నా, సిలువను వీక్షిస్తున్న తల్లికోసం లేదా శిష్యులకోసం ప్రార్ధన చేయలేదు. అంతేకాదు సిలువలో ఆయన మరణంద్వారా భవిష్యత్తు ప్రణాళికలో నిర్మించబడే సంఘంకోసం ప్రార్ధన చేయలేదు. ఆ వేదనకు బదులుగా, శత్రువుల కొరకు ప్రార్ధించాడు. ఆయన హింసకు కారణమైన వాళ్ళు కఠినంగా శిక్షించాలని కాదు గాని వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటున్నాడు.

శత్రువుల కొరకు ప్రార్ధించే క్రీస్తు ప్రేమలోని గొప్పతనం గూర్చి మనం నేర్చుకోవలసిన వారమై యున్నాము. ఈ ప్రేమ ఎటువంటి శత్రువులనైనా మిత్రులుగా మార్చేయగలదు. దోషులు ఉండవలసిన స్థానంలో వారికి బదులుగా ఏ తప్పు చేయని వ్యక్తి ఆ స్థానంలో శిక్ష పొందడం... ఇదే ఆ సిలువ గొప్పతనం.

యేసు క్రీస్తు షరతులు లేని ప్రేమను నేర్పించాడు. ఏడుమారులుమట్టుకే కాదు, డెబ్బది ఏళ్ల మారులమట్టుకైనా క్షమించాలి. ఎటువంటి పాపాత్ములనైనా, చివరికి ఆయనను సిలువేసిన వారినైనా క్షమించగల ప్రేమా స్వరూపి. అసమానమైన ప్రేమ ఆ కలువరి ప్రేమ. అట్టి క్షమాపణ జీవితమే మనకు క్షమాపణ, విడుదల. మనంకూడా ఈ క్షమాపణ ప్రార్ధనను చేయ ప్రయత్నిద్దామా?

తండ్రీ, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. లూకా 23:34