లూకా సువార్త 


  • Author: Sajeeva Vahini
  • Category: Bible Study
  • Reference: Sajeeva Vahini

ప్రేమపూరిత పదములతో, వైద్యుడైన లూకా, మనుష్య కుమారుడైన యేసుక్రీస్తు యొక్క సంపూర్ణ మానవత్వమును కడుజాగరూకతతో వర్ణించుచున్నాడు. ప్రారంభములో యేసు వంశావళిని, జననమును, బాల్యమును వివరించి వాటికి తగిన ప్రాధాన్యతను వివరించిన తరువాత కాల సంభవములను సూక్ష్మబుద్దితో తెలిపిన తదుపరి ప్రభుని బహిరంగ పరిచర్యను వర్ణింపబూనుకొన్నాడు. ఆ బహిరంగ పరిచర్య సామాన్య ప్రజలలో యేసునందు విశ్వాసము పెరుగుచుండగా మరొకవైపు ఆయన శత్రువులలో విరోధ భావములు పెరుగుచుండెను. ఇట్టి పరిస్థితులలో విశ్వసించిన వారికి శిష్యత్వపు విలువలు తరిచి తెలిసికొనుట సవాలుగా మారినది. విరోధులు మనుష్య కుమారుడు సిలువపై ఒక మృతదేహముగా వ్రేలాడుట చూచువరకు మనశ్శాంతి పొందలేదు. కాని ఆయన పురుత్థానుడైన తరువాత స్థితిగతులకు మార్పు వచ్చెను. తుదకు మనుష్య కుమారుడైన క్రీస్తులో దేవుని చిత్తము సంపూర్ణముగా నెరవేరెను.

లూకా అను నామము క్రొత్త నిబంధనలో ముమ్మారు మాత్రమే చెప్పబడినది. కొలొస్సయులకు 4:14; 2 తిమోతికి 4:11; ఫిలేమోనుకు 1:24. ఉద్దేశము : యేసు క్రీస్తు జీవితమును గూర్చి అధిక వివరముల నిచ్చుట యేసుక్రీస్తు సంపూర్ణ మానవుడు నిజ రక్షకుడు అని చూపుట.

గ్రంథకర్త : గ్రీకు దేశస్థుడును వైద్యుడైన లూకా (కొలొస్సయులకు 4:14) కొత్త నిబంధన రచయితలలో అన్యుడైన ఒకే యొక వ్యక్తి. ఇతడు అపొస్తులుడైన పౌలుతో బాటు ప్రయాణములు చేసినవాడు. అపోస్తులుల కార్యములు అను గ్రంథరచయిత, ఈ రెండు పుస్తకములు ఒకదానికొకటి సంపూర్ణములుగా నున్నవి.

ఎవరికి వ్రాయబడెను : ఘనత వహించిన థెయొఫిలాకును, అన్యజనులకును వ్రాయబడెను.

కాలము : సుమారు క్రీ.శ 60.

గత చరిత్ర : లూకా కైసరియాలో ఉంటున్నప్పుడుగాని రోమాలో ఉంటున్నప్పుడుగాని దీనిని వ్రాసి యుండవచ్చును.

ప్రముఖ వ్యక్తులు : యేసు, ఎలీసబెతు, జెకర్యా, బాప్తీస్మమిచ్చు యోహాను, మరియ, శిష్యులు, మహా హేరోదు, పిలాతు, మగ్దలేనే మరియ

ముఖ్య స్థలములు : బెత్లెహేము, గలిలయ, యూదయ, యెరూషలేము.

గ్రంథ విశిష్టత : అత్యధిక సమాచారములు కలిగిన సువార్త పుస్తకము ఇది. సాధారణ బాషా రీతి పదసముదాయముతో రచయిత గొప్ప విద్వాంసుడని తెలియుచున్నది. పలు విధములగు వ్యాధులను గూర్చి తరచుగా వివరించుచున్నాడు. బహుజనసమూహములతో యేసుకు గల సంబంధమును, ఆయన ప్రార్ధనా జీవితమును, ఆయన చేసిన అద్భుతములను, దూతలను గూర్చి స్పష్టముగా చెప్పి యుండెను.

ముఖ్య పదము : మనుష్య కుమారుడైన యేసు.

ముఖ్య వాక్యములు : లూకా 1:3-4; లూకా 19:10

ముఖ్య అధ్యాయము : 15. ఈ పదునైదవ అధ్యాయములో చెప్పబడిన తప్పిపోయిన గొట్టె, పోగొట్టుకొనబడిన వెండి నాణెము, తప్పిపోయిన కుమారుడు అను ఉపమానముల ద్వారా రక్షణ సువార్త సారాంశమును ప్రభువు తెలియజేసెను. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. వాక్యమే సువార్త సారం.

గ్రంథ విభజన : చరిత్ర సంభంధమైన ఆధారములతో లూకా తన సువార్తను వ్రాశాడు. కాలక్రమమునకు చరిత్ర ఆధారములు ఎంత ప్రాముఖ్యమైనవో లూకా ఎరిగియుండెను. కావుననే ఈ సువార్త గ్రంథము మాత్రమే నాలుగు సువార్తలలో కంటే లోకమంతట అత్యధికముగా ప్రసిద్ధి గాంచుటకు అర్హముగా నున్నది. నాలుగు సువార్తలలో ఇది దీర్ఘమైనది. సాహిత్య రూపములో ఇది అగ్రభాగమున నిలుచున్నది. ఈ గ్రంథము పాపమానవులను వెదకి రక్షించుటకై వచ్చిన సంపూర్ణమానవునిగా యేసును చిత్రించుచున్నది. దీనిని నాలుగు ప్రధాన భాగములుగా విభజింపవచ్చును.

  1. మనుష్యకుమారుని ఆగమనము Luke,1,1-4,13. 2. మనుష్యకుమారుని పరచర్య Luke,4,14-9,50. 3. మనుష్యకుమారుని తృణీకరించుట Luke,9,51-19,27.  4. మనుష్య కుమారుని సిలువ మరణము పునరుత్థానము Luke,19,28-24,53.

సంఖ్యా వివరములు : పరిశుద్ధ గ్రంథములో 42వ పుస్తకము, అధ్యాయములు 24; వచనములు 1,151; ప్రశ్నలు 165; నెరవేరిన పాతనిబంధన ప్రవచనములు 9; క్రొత్త నిబంధన ప్రవచనములు 54; చరిత్రాత్మక వాక్యములు 930; నెరవేరిన ప్రవచన వాక్యములు 118; నెరవేరనున్న ప్రవచన వాక్యములు 103.